మొహాలీ: భారీ హిట్టర్లను కలిగివున్న గుజరాత్ లయన్స్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు సొంత మైదానంలో షాకిచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-9 (ఐపిఎల్)లో భాగంగా సోమవారం గుజరాత్ లయన్స్ను ఢీకొన్న పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో చిత్తయింది. తొలిసారి ఐపిఎల్లోకి అడుగుపెట్టిన గుజరాత్ తొలి మ్యాచ్లోనే విజయంతో బోణీ చేసింది.
ఆరోన్ ఫించ్ 74 పరుగులు ఈ జట్టు విజయానికి దోహదపడ్డాయి. అంతకు ముందు డ్వెయిన్ బ్రేవో 22 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ను కట్టడి చేశాడు. గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ ఇన్నింగ్స్కు ఓపెనర్లు మురళీ విజయ్, మానన్ వోహ్రా చక్కటి ఆరంభాన్నిచ్చారు.
8.2 ఓవర్లలో వీరు మొదటి వికెట్కు 78 పరుగులు జోడించారు. 23 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేసిన వోహ్రాను దినేష్ కార్తీక్ క్యాచ్ పట్టగా, రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో పంజాబ్ తొలి వికెట్ కల్పోయింది. విజయ్ 34 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్తో 42 పరుగులు చేసి, జడేజా బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

వీరిద్దరు ఔటైన తర్వాత పంజాబ్ పరుగుల వేగం మందగించింది. హార్డ్ హిట్టర్ గ్లేన్ మాక్స్వెల్ రెండు పరుగులకే అవుట్కాగా, కెప్టెన్ డేవిడ్ మిల్లర్ 15 పరుగులు చేసి వెనుదిరిగాడు. 102 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన స్థితిలో జట్టును ఆదుకునే బాధ్యతను వికెట్కీపర్/బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా, మార్కస్ స్టోనిస్ స్వీకరించారు. వీరు ఐదో వికెట్కు 55 పరుగులు జోడించారు.
సాహా 25 బంతుల్లో 20, స్టోనిస్ 22 బంతుల్లో 33 చొప్పున పరుగులు చేసి, చివరి ఓవర్లో పెవిలియన్ చేరారు. పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగా, అప్పటికి అక్షర్ పటేల్ (4), మిచెల్ జాన్సన్ (0) క్రీజ్లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో డ్వెయిన్ బ్రేవో 22 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టగా, జడేజా 30 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
కాగా, తొలిసారి ఐపిఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్ మొదటి మ్యాచ్లోనే విజయం సాధించేందుకు 162 పరుగులు సాధించాల్సి ఉండగా.. ఓపెనర్ బ్రెండన్ మెక్కలమ్ మొదటి ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్లో బంతిని కొట్టేందుకు క్రీజ్ విడిచి ముందుకొచ్చిన అతను వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహా స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు.
ఆ తర్వాత ఫించ్తో కలిసి రెండో వికెటకు 4.3 ఓవర్లలో 51 పరుగులు జత చేసిన రైనా 20 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద స్టోనిస్ బౌలింగ్లో మిచెల్ జాన్సన్కు దొరికాడు. క్రీజ్లో నిలదొక్కుకున్న ఫించ్ 32 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. దినేష్ కార్తీక్తో కలిసి మూడో వికెట్కు 6.2 ఓవర్లలో 65 పరుగులు జోడించిన తర్వాత అతను ప్రదీప్ సాహూ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వృద్ధిమాన్ సాహా స్టెంప్ చేయడంతో వెనుదిరిగాడు.
ఫించ్ 47 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. ఐపిఎల్లో అతనికి ఇది రెండో అత్యధిక స్కోరు. 2014లో అతను ఢిల్లీ డేర్డెవిల్స్పై అజేయంగా 88 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా ఎనిమిది పరుగులు చేసి రనౌటయ్యాడు.
భారత అండర్-19 జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ 11 పరుగులు చేసి మిచెల్ జాన్సన్ బౌలింగ్లో మోహిత్ శర్మకు సులభమైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, అప్పటికే గుజరాత్ విజయం ముంగిట నిలిచింది. 17.4 ఓవర్లలో 162 పరుగులు సాధించి ఈ జట్టు విజయభేరి మోగించే సమయానికి దినేష్ కార్తీక్ 41, డ్వెయిన్ బ్రేవో 2 పరుగులతో నాటౌట్గా ఉన్నారు.
బ్రావో ప్రపంచ రికార్డు
ఐపిఎల్ 9లో భాగంగా సోమవారం కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా గుజరాత్ లయన్స్ తరపున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసిన బ్రావో.. టీ20 క్రికెట్ చరిత్రలో 300లకు పైగా వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
302(292 మ్యాచులు)-డ్వేన్ బ్రావో(వెస్టిండీస్)
299(221)-లసిత్ మలింగ(శ్రీలంక)
277(217)-యాసిర్ అరాఫత్(పాకిస్థాన్)
263(225)-అల్ఫోన్సో థామస్(దక్షిణాఫ్రికా)
257(215)- డర్క్ నన్నెస్(ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్)