మొహాలీ: నరాలు తెగే ఉత్కంఠ, రెండు జట్ల చేతులు మారిన ఆధిక్యం, ఓవర్ ఓవర్కూ పెరిగిన ఉద్వేగం, అసలు సిసలు ట్వంటీ 20 మజా అంటే ఏమిటో సోమవారం కింగ్స్ పంజాబ్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ రుచి చూపించింది.
చివరి బంతి వరకు స్టేడియంలోని ప్రేక్షకులను..టీవీ వీక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ థ్రిల్లింగ్ ఫైట్లో చివరకు బెంగళూరు ఒక్క పరుగు తేడాతో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్ 9 సీజన్లో బెంగళూరు జట్టు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
సోమవారం మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హోరాహోరీగా పోరాడి ఒక పరుగు తేడాతో కోహ్లీ సేన ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. డివిలీర్స్ (64) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో మురళీ విజయ్ (89; 57బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, చివర్లో మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులకు పరిమితమై ఓటమిపాలైంది.
కాగా, మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగింది. పంజాబ్ వికెట్ పడిపోయినప్పుడు, ఫీల్డింగ్ మిస్ చేసినప్పుడు.. ఆ జట్టు ఓనర్ ప్రీతిజింతా తలపట్టుకున్నారు. వేదనాభరితంగా కనిపించారు. కోహ్లీ కూడా చివరి వరకు ఉత్కంఠగా, అప్పుడప్పుడు సీరియస్గా కనిపించాడు. అయితే, చివరి బంతికి, ఒక్క పరుగుతో గెలవడంతో గంతులేశాడు.

స్టెప్తో అదరగొట్టిన కోహ్లీ, గేల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్కోహ్లీ మరోసారి తన డాన్స్తో అదరగొట్టాడు. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, వాట్సన్, సర్ఫరాజ్ ఖాన్ అతడితో జత కలిశారు. బెంగళూరులో ఇంతకు ముందు జరిగిన ఆర్సీబీ పార్టీలో డివిలియర్స్ భార్య పాడిన పాటకు షేన్వాట్సన్ గిటార్ ప్లే చేయగా కోహ్లీ, గేల్ కలిసి డాన్స్ చేసి ఉర్రూతలూగించారు.
తాజాగా డీజే నిఖిల్ చిన్నప్ప, ఎఫ్ఎం ఫీవర్ 104 ద్వారా ప్రాచుర్యం పొందిన నాగ్స్తో రూపొందించిన 'ఆర్సీబీ ఇన్సైడర్' పాటకు కోహ్లీ, క్రిస్గేల్, వాట్సన్, ఏబీ డివిలియర్స్, సర్ఫరాజ్ఖాన్ స్టెప్పులేసి అలరించారు. ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్లో 84వేల మందికి పైగా వీక్షించారు.