ముంబై: కీలకమైన మ్యాచులో దూకుడుగా ఆడి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఐపియల్ 8లో నాకౌట్ ఆశలను సజీవం చేసుకుంది. డివిల్లీర్స్ సూపర్ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు రాయల్ చాలెంజర్స్కు ఏకపక్ష విజయాన్ని సాధించి పెట్టాయి. ముంబై ఇండియన్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 39 పరుగుల తేడా భారీ విజయాన్ని అందుకుంది.
డివిల్లీర్స్ (59 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 133 నాటౌట్) సెంచరీకి తోడు కోహ్లీ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 నాటౌట్) అర్ధ సెంచరీతో ముంబై ఇండియన్స్ బౌలర్లను ఉతికి ఆరేయడంతో బెంగళూరు 39 పరుగుల తేడాతో ముంబైపై నెగ్గింది.

ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది. డివిల్లీర్స్-కోహ్లీ రెండో వికెట్కు 215 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త ఐపీఎల్ రికార్డు నెలకొల్పారు. అనంతరం ఓవర్లన్నీ ఆడి ముంబై 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులకే పరిమితమైంది. సిమన్స్ (68 నాటౌట్), పొలార్డ్ (49) పోరాడినా ఓటమి తప్పలేదు. హర్షల్ పటేల్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు. డివిల్లీర్స్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.


అంతకుముందు బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే గేల్ సిక్సర్ బాది మరో భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. మూడో ఓవర్లో గేల్, కోహ్లీకి చెరో లైఫ్ లభించింది. అయితే మలింగ వేసిన నాలుగో ఓవర్లో గేల్ (13) అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీతో దక్షిణాఫ్రికా హిట్టర్ డివిల్లీర్స్ జతకట్టి ముంబై ఇండియన్స్ బౌలర్లను చితకబాదారు.
