ముంబై: ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ గుండెల్లో గుబులు పుట్టించింది. గురువారంనాడు జరిగిన మ్యాచులో రాయల్స్ చివరి వరకు పోరాటం చేసి 7 పరుగుల తేడాతో హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. హైదరాబాద్ తన ముందు ఉంచిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్స్ ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. రాయల్స్ 14 పాయింట్లు సాధించింది. మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. కాగా, హైదరాబాద్ పది పాయింట్లతో ఉంది. కానీ నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. రాయల్స్కు తర్వాతి రెండు మ్యాచులు కూడా కఠినమైనవే.
సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ముందుంచిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ వాట్సన్ 12 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు అజింక్యా రహనే కేవలం 8 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన నాయర్ హెన్రిక్స్ బౌలింగులో అవుటయ్యాడు.
77 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. 7 పరుగులు మాత్రమే చేసి హుడా కెవి శర్మ బౌలింగులో పెవిలియన్ దారి పట్టాడు. రాజస్థాన్ రాయల్స్ 121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ 68 పరుగులు చేసిన స్మిత్ బొపారా బౌలింగులో అవుటయ్యాడు.
శిఖర్ ధావన్, మోర్గాన్ రెచ్చిపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.
శిఖర్ ధావన్ 35 బంతుల్లో 54 పరుగులు చేయగా, మోర్గాన్ 28 బంతుల్లో 63 పరుగులు చేశాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 24 పరుగులు, రవి బొపారా 20 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో షేన్ వాట్సన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ వాట్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. డేల్ స్టెయిన్, బిపుల్ శర్మ స్థానాల్లో రవి బొపారా, ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చారు.