కోల్కతా:సునీల్ నరైన్ మిస్టరీ బౌలర్ కాదని, నాణ్యమైన బౌలర్ అని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తనపై తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని అధిగమించి నరైన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పైన గొప్పగా రాణించాడని కితాబిచ్చాడు.
బౌలింగ్ దళానికి నరైన్ నాయకుడిలాంటివాడని, అతను మిస్టరీ బౌలర్ అని కొంతమంది అంటుంటారని, అతను అంతేకాదు, అతని మిస్టరీ వీడిపోయిందని చెబుతుంటారని, కానీ అతను మిస్టరీ బౌలర్ కాదని, నాణ్యమైన బౌలర్ అన్నాడు. ఎప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణిస్తాడన్నాడు. ఇందుకు పంజాబ్ పైన అతని ప్రదర్శనే నిదర్శనం అన్నాడు.
కాగా, ఐపీఎల్ -8లో భాగంగా శనివారం చివరి క్షణం వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ఒక బంతి మిగిలి ఉండగా ఒక వికెట్ తేడాతో ఓడించింది. 184 పరుగుల లక్ష్యాన్ని నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి చేధించింది. పోరాడి ఓడిన పంజాబ్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
ఈ జట్టు చివరి మూడు గ్రూప్ మ్యాచ్ల్లో 11న సన్ రైజర్స్ హైదరాబాద్, 13న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 16న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్లను గెలిచినా ఫలితం ఉండదు. 11వ మ్యాచ్ ఆడిన ఈ జట్టు తొమ్మిదో పరాజయాన్ని చవిచూడడంతో మిగతా మ్యాచ్లు నామమాత్రంగా మారాయి.

శనివారం నాడు సొంతగడ్డపై నైట్ రైడర్స్ మరోసారి చెలరేగింది. ఈడెన్ గార్డెన్లో హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టింది. రస్సెల్ మెరుపు అర్ధశతకానికి తోడు యూసుఫ్ పఠాన్ (19 బంతుల్లో 29), చావ్లా (11 బంతుల్లో 18) రాణించడంతో కోల్కతా పంజాబ్పై ఉత్కంఠ విజయం సాధించింది.
గంభీర్ (24), మనీష్ పాండే (22) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అనురీత్ సింగ్, గుర్కీరత్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 183 పరుగులు చేసింది. మాక్స్వెల్ (22 బంతుల్లో 43) సీజన్లో తొలిసారి మెరిశాడు. వోహ్రా (39), వృద్ధిమాన్ సాహా (33), మురళీ విజయ్ (28) రాణించారు. మిల్లర్ (11 బంతుల్లో 27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
మళ్లీ జట్టులోకొచ్చిన నరైన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో టోర్నీలో ఏడో గెలుపుతో గంభీర్ సేన మొత్తం 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. నాలుగు పాయింట్లతో ఇప్పటికే అట్టడుగు స్థానంలో ఉన్న పంజాబ్ ఖాతాలో తొమ్మిదో పరాజయం చేరింది. టోర్నీలో వేగవంతమైన అర్ధశతకం (19 బంతుల్లో) సాధించి హర్భజన్ సరసన నిలిచిన రస్సెల్కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ను కెరీర్ను ప్రమాదంలో పడేసుకున్న వెస్టిండీస్ స్పిన్ మాంత్రికుడు నరైన్ శనివారం నాటి మ్యాచ్లో అద్భుత ప్రతిభ కనబరచి, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశాడు. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చిన అతను 4 వికెట్లు పడగొట్టాడు.