ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీకి అభిమానిని:
'ఆర్సీబీ ఫాన్ గర్ల్' అంటూ అందరూ దీపికా ఘోష్ను సోషల్ మీడియాలో ఎత్తేసారు. దీంతో ఇప్పుడు ఆర్సీబీ ఫాన్ గర్ల్ దీపికా ఘోష్ అంటే గుర్తుపట్టని వారు ఎవరూ ఉండరు. అయితే ఈ గుర్తింపు పట్ల దీపికా బాధపడుతూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టింది. 'నా పేరు దీపిక ఘోష్. ఇదే నా అసలైన గుర్తింపు. మే 4న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు అభిమానిగా మ్యాచ్ను చూసేందుకు స్టేడియంకు వచ్చా. గత కొన్ని ఏళ్లుగా నేను ఐపీఎల్లో ఆర్సీబీకి అభిమానిగా ఉన్నా. అలాగే ఈ ఏడాది కూడా ఉన్నాను. సొంత జట్టు బెంగళూరుకు నా పూర్తి మద్దతు ఉంటుంది' అని దీపిక తెలిపింది.

నేను సెలబ్రిటీని కాదు:
'మ్యాచ్లో నేను ప్రత్యేకంగా కనపడాలని అనుకోలేదు. నాకెలాంటి గుర్తింపు కూడా అవసరం లేదు. నేను సెలబ్రిటీని కాదు.. నేనూ సాధారణ అమ్మాయి లాగే మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాను. టీవీలో నా క్లిప్పింగ్స్ వచ్చినా కూడా పట్టించుకోలేదు. అలాంటి గుర్తింపు నాకు అనవసరం. నేనొక కష్టపడే ఉద్యోగిని, అది నాకు గర్వంగా ఉంది. నేను చదువుకున్న అమ్మాయిని. నాకు చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంది. నా కుటుంబీకులు, స్నేహితులు నన్ను చాలా ప్రేమిస్తారు' అని దీపికా పేర్కొన్నారు.

ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య పెరిగింది:
'మ్యాచ్ ద్వారా వచ్చే గుర్తింపు నేను పట్టించుకోను. అయితే ఈ మ్యాచ్ తర్వాత నా జీవితం మారిపోయిందని చాలా మంది అంటున్నారు. నిజానికి ఏమి మారలేదు కానీ.. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. మీలాగే నేను ఆశ్చర్యపోతున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. కానీ చాలా మంది నన్ను దూషిస్తున్నారు. అది నన్ను ఇబ్బంది పెడుతోంది. మనోవేదనకు కూడా గురయ్యా' అని దీపికా చెప్పుకొచ్చారు.

నా విషయాలు హ్యాక్ అయ్యాయి:
'ఇంతకు నా పేరు, ప్రొఫైల్ ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. ఇన్స్టాగ్రామ్ ద్వారా నా విషయాలు హ్యాక్ చేయబడ్డాయి. మెన్స్ ఫాలోవర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా నన్ను వేధిస్తున్నారు. నన్నెందుకు ఫాలో అవ్వాలో చెప్పమంటున్నారు. ఇది మరింత కలచివేస్తోంది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించండి. నేను ఆర్సీబీఅమ్మాయినే.. కానీ అంతకన్నా ఎక్కువే' అని దీపికా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












