కొంత నిరాశపరిచింది:
ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ... 'ఒక జట్టుగా మేము సీజన్లో మంచి క్రికెట్ ఆడాం. ఫైనల్ చేరుకోవడానికి చాలా కష్టపడ్డాం. గతంలో కూడా ఫైనల్ చేరుకున్నా.. ఈ సారి కొంత నిరాశపరిచింది. మొదటి సీజన్ నుంచి కూడా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం' అని ధోనీ అన్నారు.
విజయానికి వారు అర్హులు:
'మా మిడిల్ ఆర్డర్ బాగాలేదు. ఈ రోజు ఎంతో సరదాగా మ్యాచ్ సాగింది. ట్రోఫీని ముంబై, చెన్నై ఒకరి నుంచి ఒకరం మార్చుకుంటున్నాం. ఫైనల్ మ్యాచ్లలో పొరపాట్లు సహజమే. అయితే తక్కువ పొరపాట్లు చేసిన జట్టే విజయం సాధిస్తుంది. ఈ రోజు ముంబై అదే చేసి విజయం సాధించింది. ఈ విజయానికి వారు పూర్తి అర్హులు' అని ధోనీ పేర్కొన్నారు.
ప్రపంచకప్ అనంతరం దృష్టి పెడతాం:
'మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఈ పిచ్పై 150 పరుగులకంటే ఎక్కువ చేయొచ్చు. అయినా మా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. వికెట్ అవసరమైన ప్రతీసారి బౌలర్లు వికెట్లు తీశారు. తక్కువ పరుగులు చేదించేటప్పుడు ఇన్నింగ్స్ ఆరంభంలో ఒక బ్యాట్స్మన్ బాగా ఆడాలి. గత మ్యాచ్లలో ఇదే చేసాం. కానీ ఈ సారి అలా కుదరలేదు. మిడిల్ ఆర్డర్లో కొంచెం విఫలమైంది. ప్రపంచకప్ అనంతరం వీటన్నింటిపై దృష్టి పెడతాం' అని ధోనీ చెప్పుకొచ్చారు.
చెన్నై ఓటమి:
ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు.