
ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్ కీలక చివరి ఓవర్లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ (80; 59 బంతుల్లో 8×4, 4×6) అనూహ్యంగా రనౌట్ అవ్వడంతో.. చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై చెన్నై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆదివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. గెలవాల్సిన మ్యాచ్ను చెన్నై తన చేతులారా పోగొట్టుకుని మూల్యం చెల్లించుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
చివరి ఓవర్లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. మలింగ వేసిన తొలి బంతికి వాట్సన్ సింగల్ తీయగా.. రెండో బంతికి జడేజా సింగల్ తీసాడు. ఇక మూడో బంతికి వాట్సన్ రెండు పరుగులు చేసాడు. దీంతో 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. అప్పటికే వాట్సన్ జోరుమీదుండడంతో చెన్నై విజయం ఖాయం అనుకున్నారు అందరు. చెన్నై అభిమానులు సంబరాలు చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు.
నాలుగో బంతిని వాట్సన్ డీప్ పాయింట్ వైపు షాట్ ఆడగా.. మొదటి పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించిన వాట్సన్ రనౌటయ్యాడు. వాట్సన్ రెండో రన్ కోసం వెళ్లాలా వద్దా అనుకుంటుండగానే.. జడేజా పరుగు కోసం ప్రయత్నించడంతో అతను కూడా వెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటి వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్ ముంబయి వైపు తిరిగింది. 2 బంతుల్లో 4 పరుగులు కావాలి. ఐదో బంతికి 2పరుగులు తీసిన శార్దూల్.. చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో చెన్నై ఓడింది.
చెన్నై విజయానికి 10 బంతుల్లో 17 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన జడ్డు.. 5 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసాడు. ఇక వాట్సన్ను కూడా రనౌట్ చేయడంతో ట్విట్టర్ వేదికగా చెన్నై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. '2017 ఛాంపియన్ ట్రోఫీలో కూడా ఇలానే చేశాడంటూ' చెన్నై అభిమానులు మండిపడుతున్నారు. 'జడేజా అత్యుస్తాహం వలన వాట్సన్ బలయ్యాడు', 'జడేజా అపరాధి', 'జడేజా ఒక ఇడియట్' అంటూ విమర్శిస్తున్నారు.