ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్ చరిత్రలో అత్యధికంగా నాలుగోసారి కప్ అందుకున్న జట్టుగా ముంబై నిలిచింది. ఇక మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ మాట్లాడారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
'థాంక్యూ ఆకాశ్. మాతృ దినోత్సవం రోజు ఐపీఎల్ ట్రోఫీనే బహుమతిగా ఇచ్చావు' అని కుమారుడు అకాశ్ అంబానీతో నీతా అన్నారు. ముంబై జట్టు ప్రధాన కోచ్ మహేళ జయవర్దనే మాట్లాడుతూ... 'జట్టులోని ఆటగాళ్లు ఎటువంటి ఇబ్బంది పడకుండా అకాశ్ చూసుకుంటాడు. ముంబై యాజమాన్యం జట్టు సభ్యులతో స్నేహంగా ఉంటారు. ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిన జట్టును నీతా అంబానీ ఇంటికి ఆహ్వానించి ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపారు' అని జయవర్దనే తెలిపారు.
ఆదివారం చెన్నై, ముంబై జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై నుండి ఆ జట్టు యజమాని నీతా అంబానీ ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియంకు చేరుకొని కొద్దిసేపు మ్యాచ్ను చూసిన నీతా .. ఆట మధ్యలోనే స్టేడియం నుండి బయటకు వచ్చారు. సుమారు రాత్రి 9.10 గంటల సమయంలో బల్కంపేటలోని ఎల్లమ్మ గుడికి చేరుకున్నారు.
అక్కడ ఆలయ ఈఓ, అర్చకులు ఆమెకు స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై అమ్మవారి శేషవస్త్రంతో నీతా అంబానీని సన్మానించారు. అనంతరం ప్రధాన అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడి ఆవరణలో ఉన్న పోచమ్మ, నాగదేవతలను కూడా నీతా దర్శించుకున్నారు. చివరగా హండీలో కానుకలు సమర్పించుకునిస్టేడియంకు చేరుకున్నారు.