హైదరాబాద్: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 231 భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు మాత్రమే చేసింది.
ముంబై బ్యాట్స్మెన్లలో సిమ్మన్స్ 59, పొలార్డ్ 50 పరుగులతో రాణించారు. పార్ధీవ్ పటేల్ 38, హార్దిక్ పాండ్యా 30 పరుగులతో ఫరవాలేదనిపించారు. ఇక పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు తీసుకోగా, సందీప్ శర్మ, అక్షర పటేల్, మ్యాక్స్ వెల్, తెవాటియా తలో వికెట్ తీశారు.
ముంబై విజయ లక్ష్యం 231
హైదరాబాద్: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ ఓపెనర్ ఆమ్లా అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సాహాను ఓపెనర్గా వచ్చాడు.
ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, సాహా మంచి శుభారంబాన్ని అందించారు. మలింగ వేసిన మూడో ఓవర్లో గప్టిల్, సాహాలు బౌండరీలతో విరుచుకపడి 19 పరుగులు సాధించారు. ఈ దూకుడుతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేయగలిగింది.

మార్టిన్ గప్టిల్ (37) కరణ్ శర్మ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్, సాహాతో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. హార్భజన్ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్లు బాది 21 పరుగులు రాబట్టారు.
ఈ దశలో చెలరేగి ఆడుతున్న మ్యాక్స్వెల్... బుమ్రా బౌలింగ్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన షాన్ మార్ష్తో సాహా ఇన్నింగ్స్ కొనసాగించాడు. హార్భజన్ వేసిన బంతిని సిక్సర్గా మలిచిన సాహా 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
ఈ సమయంలో భారీ షాట్కు ప్రయత్నించిన షాన్ మార్ష్ (25) క్యాచ్ రూపంలో మూడో వికెట్గా వెనుదిరిగాడు. చివర్లో సాహా, అక్సర్ దాటిగా ఆడటంతో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి ఈ సీజన్లోనే అత్యధిక పరుగులు 230 చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కరణ్ శర్మ, మెక్లిన్ గన్కు తలో వికెట్ దక్కింది.
పంజాబ్పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
స్వప్నిల్ స్థానంలో ఇషాంత్శర్మ జట్టులోకి వచ్చినట్లు పంజాబ్ సారథి మాక్స్వెల్ తెలిపాడు. ఈ మ్యాచ్ తమకు సెమీ ఫైనల్ లాంటిదన్నాడు.
లీగ్ స్టేజిలో పదో సీజన్ను కీలక మలుపు తిప్పే మ్యాచ్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడిపోతే, ప్లే ఆఫ్కు ఏయే జట్లు వెళ్తాయో తేలిపోతుంది. ఈ మ్యాచ్ ఫలితం నాలుగు జట్ల భవితవ్యాన్ని నిర్దేశిస్తుండటంతో ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్ చేరుకుంది.

ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలుస్తుంది. ప్రస్తుతం 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ 20 పాయింట్లతో నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకుంటుంది. ఇక ఒకవేళ పంజాబ్ జట్టు గెలిస్తే మాత్రం సన్రైజర్స్ ముందు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఒకటి ఉంటుంది.
శనివారం నాడు గుజరాత్ లయన్స్తో కాన్పూర్లో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:
సిమన్స్, పార్థీవ్ పటేల్, నితీశ్ రాణా, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కర్ణ్ శర్మ, హర్భజన్ సింగ్, మెక్లనగాన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
మనన్ వోహ్రా, మార్టిన్ గప్తిల్, షాన్ మార్ష్, సాహా, మాక్స్వెల్, అక్షర్ పటేల్, రాహుల్ తెవాటియా, మాట్ హెన్రి, మోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, సందీప్ శర్మ