హైదరాబాద్: రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. గుజరాత్ ఆటగాడు మెక్కల్లమ్ 44 బంతుల్లో 72 పరుగులతో రాణించాడు.
ఓపెనర్ మెక్కలమ్ (44 బంతుల్లో 72; 2 ఫోర్లు, 7 సిక్సుల)తో దూకుడు ఆడటంతో ఒకానొక దశలో గుజరాత్ గెలుపు దిశగా సాగినా.. జట్టు స్కోరు 137 వద్ద అతడు అవుట్ కావడంతో బెంగళూరు విజయం ఖాయమైంది. చివర్లో ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 39: 2 ఫోర్లు, 4 సిక్సులు)లతో రాణించాడు.
బెంగళూరు బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీయగా.. పవన్ నేగి, అరవింద్, మిల్నే తలో వికెట్ తీశారు. ఐపీఎల్ పదో సీజన్లో ఆరో మ్యాచ్ ఆడిన బెంగళూరుకు ఇది రెండో విజయం.
గుజరాత్ విజయ లక్ష్యం 214
రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దీంతో గుజరాత్కు 214 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
బెంగళూరు ఓపెనర్లు క్రిస్ గేల్ (38 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సులు), విరాట్ కోహ్లీ (50 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. క్రిస్ గేల్ విజృంభించి 38 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీ20ల్లో పది వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు.

ఇక కోహ్లీ 50 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 64 పరుగుల్ని నమోదు చేశాడు. వీరిద్దరి జోడీ తొలి వికెట్కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్కు అదృష్టం కలిసి రాగా, గుజరాత్ ఫీల్డర్ మెకల్లమ్ను దురదృష్టం వెంటాడింది. గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన ఇన్నింగ్స్ 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు.
దీనిని మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అతని పెట్టుకున్న ఫ్లాపీ హ్యాట్ గేల్ను రక్షించింది. థర్డ్ అంపైర్ రివ్యూలో క్యాప్ బౌండరీకి తగలడంతో గేల్ నాటౌట్గా ప్రకటించాడు. ఇక అర్ధసెంచరీ పూర్తి అయిన తర్వాత కోహ్లీ జోరును మరింత పెంచే క్రమంలో రెండో వికెట్గా వెనుదిరిగాడు.
చివర్లో ట్రావిస్ హెడ్ (30 నాటౌట్: 16 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సు), కేదార్ జాదవ్ (16 బంతుల్లో 38 నాటౌట్: 5 ఫోర్లు, 2 సిక్సుల)తో రాణించడంతో బెంగళూరు భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో కులకర్ణి, థంపి చెరో వికెట్ తీశారు.
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా మంగళవారం రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ లయన్స్లో జేసన్ రాయ్, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్ ఆడడం లేదు.
ఇక గాయం కారణంగా బెంగళూరు జట్టులో డివిలియర్స్ ఆడడం లేదు. అతడి స్థానంలో క్రిస్గేల్ జట్టులోకి వచ్చాడు. టీ20ల్లో గేల్ 10,000 స్కోర్ చేసేందుకు 3 పరుగుల దూరంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఒక్కో మ్యాచ్లో మాత్రమే విజయం సాధించాయి.
గుజరాత్ నాలుగు మ్యాచ్లు ఆడగా మూడింటిలో.. బెంగళూరు ఐదు మ్యాచ్లు ఆడగా నాలుగింటిలో పరాజయం పాలయ్యాయి. దీంతో మంగళవారం జరిగే మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది.
జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, షేన్ వాట్సన్, మన్ దీప్ సింగ్, ట్రావిస్ హెడ్, కేదర్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ, మిల్నీ,ఎస్ అరవింద్, చాహల్, పవన్ నేగీ
గుజరాత్ లయన్స్:
సురేశ్ రైనా(కెప్టెన్), బ్రెండన్ మెకల్లమ్, డ్వేన్ స్మిత్, అరోన్ ఫించ్,దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషాన్, రవీంద్ర జడేజా, ధావల్ కులకర్ణి, బాసిల్ థంపి, ఆండ్రూ టై, శివిల్ కౌశిక్