హైదరాబాద్: ఐపీఎల్ 10 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. హైదరాబాదులో జరిగిన తొలి మ్యాచులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది.
ఇదే సమయంలో హైదరాబాదులో రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లుగా కనిపించింది. ఇరువురు కూడా బుధవారం ఎడమొహం, పెడమొహంగా కనిపించారు.

టీమిండియా కోచ్ ఎంపిక సమయంలో రవిశాస్త్రి, గంగూలీ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటికే టీమిండియా డైరెక్టర్గా ఉన్న రవిశాస్త్రిని కాదని సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కమిటీ అనిల్ కుంబ్లేను కోచ్గా ఎంపిక చేసింది.
తనకు కోచ్ పదవి రాకుండా గంగూలీ అడ్డుకున్నాడంటూ అప్పట్లో రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలపై గంగూలీ కూడా ఘాటుగా స్పందించాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఐపీఎల్ ఆరంభ వేడుకలో రవిశాస్త్రి, గంగూలీ ఎడమొహం, పెడమొహంగా కనిపించారు.
ఆరంభ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవిశాస్త్రి మాట్లాడుతున్నంతసేపు గంగూలీ నేల చూపులు చూస్తూ కనిపించాడు. కార్యక్రమం అనంతరం మిగతా ముగ్గురితో రవిశాస్త్రి మాట్లాడుతూ కనిపించాడు. గంగూలీ మాత్రం దూరంగా ఉన్నాడు.