
కరాచీ: పాకిస్థాన్ బ్యాట్స్మెన్ షాట్లు ఆడేందుకు భయపడుతున్నారని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. ఇంగ్లాండ్పై రక్షణాత్మక బ్యాటింగ్ విధానంను అతడు తప్పుబట్టాడు. వ్యూహాలు మార్చుకోవాలని బ్యాట్స్మెన్, జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఆతిథ్య జట్టును రెండో టెస్టులో ఓడించి మూడు టెస్టుల సిరీస్ను సమం చేయాలంటే.. దూకుడుగా ఆడాలన్నాడు. ఇరు జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
తన యూట్యూబ్ ఛానల్లో ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడాడు. 'షాట్లు ఆడేందుకు పాక్ బ్యాట్స్మెన్ భయపడుతున్నారు. వారు ఔటైన విధానం చూస్తే.. వారి బ్యాట్లు కాళ్ల వెనకనే ఉంటున్నట్టు కనిపిస్తోంది. బంతిని ఆడాలంటే బ్యాటును కాళ్ల ముందుకు తీసుకురావాలి. మీ రక్షణాత్మక విధానం వల్లే స్లిప్లో దొరికిపోతున్నారు. ఇంగ్లాండ్ను ఓడించాలంటే దూకుడుగా క్రికెట్ ఆడాలని బ్యాట్స్మెన్, జట్టు యాజమాన్యానికి సూచిస్తున్నా. లేదంటే మ్యాచును రక్షించుకొనేందుకు వర్షంపై ఆధారపడాలి' అని ఇంజీ చెప్పాడు. .
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న తరుణంలోనూ ప్రత్యేక ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్న ఇంగ్లండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ను వరుణుడు వదలడం లేదు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓ రోజు ఆటను మింగేసిన వర్షం.. రెండో టెస్టును అసలు ముందుకు సాగనివ్వడం లేదు. తొలి రోజు సగం ఆట వరుణుడి కారణంగా నిలిచిపోగా.. రెండో రోజు కూడా అదే కథ కొనసాగింది. ఇక మూడో రోజు ఆట ప్రారంభమే కాలేదు.
మూడు రోజులలో కేవలం 86 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ మహమ్మద్ రిజ్వాన్ (60 బ్యాటింగ్), నసీమ్ షా (1) క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ప్రారంభించేందుకు మైదానం అనువుగా లేకపోవడంతో మూడు సార్లు ఔట్ ఫీల్డ్ను పరిశీలించిన అంపైర్లు మూడో రోజు ఆటను రద్దు చేశారు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.