హైదరాబాద్: ఇంజమామ్ ఉల్ హక్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్థాన్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు. క్రీజులో పాతుకుపోయాడంటే అతన్ని అవుట్ చేయడం కష్టం. అయితే వికెట్ తీయడం కంటే రన్ అవుట్ చేయడం చాలా తేలిక. ఇలా ప్రపంచ క్రికెట్లో అత్యధికంగా రనౌట్ అయిన క్రికెటర్గా కూడా గుర్తింపు పొందాడు.
తన బ్యాటింగ్తో ప్రత్యర్థులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేసే ఇంజమామ్ ఒక బ్యాట్స్ మన్ అంటే మాత్రం భయపడేవాడట. జియో స్పోర్ట్స్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ మాట్లాడుతూ టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను చూసి ఎక్కువగా భయపడినట్లు చెప్పాడు.
సెహ్వాగ్ అవుటైతే సరే కానీ, క్రీజులో నిలబడ్డాడంటే మాత్రం స్కోరు బోర్డు ఆగేది కాదని అన్నాడు. సెహ్వాగ్ 80 పరుగులు చేశాడంటే టీమిండియా 300 పరుగులు చేస్తుందనే భయం తనలో నెలకొనేదని చెప్పాడు. అంతేకాదు సెహ్వాగ్ ఎంత సేపు క్రీజులో ఉంటే బౌలర్ ఆత్మవిశ్వాసం అంతగానూ దెబ్బతింటుందని తెలిపాడు.

''వన్డేల్లో అయినా టెస్టుల్లో అయినా సెహ్వాగ్ 80 పరుగులు చేస్తే భారత జట్టు 300 దాటేది. అతను క్రీజులో ఉంటే బౌలర్ల స్థైర్యాన్ని దెబ్బ తీస్తాడు. కెప్టెన్గా నాకది పెద్ద తలనొప్పిగా ఉండేది'' అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు. ఇక భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగాలని రెండు దేశాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపాడు.
అయితే ప్రభుత్వాల మధ్య పరిస్థితులు చక్కబడేవరకు రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగడం అసాధ్యమని అన్నాడు. అయితే ద్వైపాక్షిక మ్యాచ్లు జరగకపోవడం ఇరు దేశాలకు మంచిది కాదని చెప్పాడు. పాకిస్థాన్ కోణంలో చూస్తే మాత్రం ఇప్పటికే చాలా నష్టం కలిగిందని ఇంజమామ్ తెలిపాడు.
ఇతర దేశాల ఆటగాళ్లు కూడా పాక్లో మ్యాచ్లు ఆడేందుకు రావడం లేదని పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా భారత్తో ఆడడాన్ని తాను బాగా ఆస్వాదించానని అన్నాడు. తన కెరీర్కు అది ఎంతో ఉపయోగపడిందని ఇంజమామ్ తెలిపాడు. ప్రస్తుతం పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ ఉన్న ఇంజమామ్-ఉల్-హక్ భారత్-పాక్ మధ్య సిరీస్ ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే యాషెస్ కంటే ఎంతో పెద్దదని చెప్పాడు.