
త్వరలోనే మరో జట్టు:
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసాక.. భారత్ అక్కడే ఉండి కొన్ని వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. ఆగస్టులో ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో కోహ్లీసేన తలపడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ గ్యాప్లో బీసీసీఐ మరో టూర్ను ప్లాన్ చేసింది. అదే శ్రీలంక పర్యటన. ఈ టూర్ కోసం బీసీసీఐ త్వరలోనే మరో జట్టును ప్రకటించనుంది.

ఇంగ్లండ్, లంక పర్యటనలు:
భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి.. 28న తిరుగు పయనంకానుంది. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్ ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియాలు లంక వెళ్లే అవకాశం ఉంది.

అప్పట్లో ఆస్ట్రేలియా విఫలమయింది:
'కోహ్లీ నేతృత్వంలో 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంటే, అంతే బలమైన మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు సిద్దమవడం చూస్తే భారత్ క్రికెట్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. ఈ ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు భారతదేశం ఏమి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆస్ట్రేలియా దీన్ని కొన్ని సంవత్సరాల క్రితం చేసింది. కానీ వారు అందులో విజయం సాధించలేకపోయారు. మొదటిసారిగా ఒక జాతీయ క్రికెట్ జట్టు రెండు వేర్వేరు సిరీస్లు ఆడబోతోందని నేను భావిస్తున్నా. ఒకే దేశంలో రెండు బలమైన జాతీయ జట్లు అంటే మాములు విషయం కాదు' అని తన యూట్యూబ్ ఛానెల్లో ఇంజమామ్ ఉల్ హాక్ అన్నారు.

దేశవాళీ, ఐపీఎల్ వల్లే:
'ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ను శాశిస్తున్న రోజుల్లో ఆ దేశం తరఫున రెండు బలమైన జట్లను తయారు చేయడానికి ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా కూడా చేయలేనిది ఇప్పుడు భారత్ చేస్తోంది. నాలుగుకు పైగా బలమైన జట్లను వివిధ అంతర్జాతీయ స్థాయి జట్లతో తలపడేందుకు సిద్ధం చేయగల సత్తా భారత్కు ఉంది. అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లతో పాటు ప్రతిభగల యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ రెండు జట్లను కలిగి ఉండటం సహజమే. దేశవాళీ, ఐపీఎల్ వల్లే ఇది సాధ్యం అయింది. జాతీయ జట్టు కోసం ఆడటానికి కనీసం 50 మంది ఆటగాళ్లను భారత్ సిద్ధం చేసింది' అని ఇంజీ ప్రశంసించారు.


Click it and Unblock the Notifications












