సాధారణంగా క్రికెటర్లకు 35 ఏళ్లు దాటగానే వారి ఫిట్ నెస్ స్థాయి తగ్గిపోతుంటుంది. దీంతో వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తడం, క్యాచులు పట్టుకోవడం, బంతులు సంధించడం అంత ఈజీ కాదు. అయితే అతి కొద్ది మంది మాత్రమే 35 ఏళ్ల వయసు దాటాక కూడా అడపాదడపా రాణిస్తుంటారు. అలాంటి వారిలో కుమార సంగక్కర కూడా ఒకడు. తాజాగా అతడు 47 ఏళ్ల వయసులో ఓ స్టన్నింగ్ క్యాచ్ ను పట్టి తోటి క్రికెటర్లను, క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పక్షిల్లా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు.
ఈ అద్భుత ఫీట్ ను తాజాగా ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భాగంగా శ్రీలంక మాస్టర్స్ వర్సెస్ సౌతాఫ్రికా మాస్టర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో చేశాడు కుమార సంగక్కర. స్టంప్స్ వెనక ఉన్న అతడు ఒక్కసారిగా రెప్పపాటులో వేగంగా దూసుకొచ్చిన బంతిని ఎడవ వైపుకు ఎగిరి సింగిల్ హ్యాండ్ తో పట్టుకున్నాడు. దీంతో ప్రతిఒక్కరూ నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి సంగక్కర రిటైర్ అయినప్పటికీ, అతడి ఫిట్ నెస్ ఈ స్థాయిలో ఉందేంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఇప్పటికే సంగక్కర ఫిట్ నెస్ లెవల్, ఆట పట్ల అతడు చూపించే అంకితభావం, క్రమశిక్షణ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యువ క్రికెటర్లను స్ఫర్తిగా నిలిచింది. రిటైర్మెంట్ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. తన ఆటతో యువ క్రికెటర్లకు అతడు ఆదర్శంగా నిలుస్తూనే ఉన్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా మాస్టర్స్ పై శ్రీలంక మాస్టర్స్ విజయం సాధించింది.