
హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్వహిస్తోన్న టీ20 లీగ్ పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) మూడో సీజన్ ఫిబ్రవరి 22 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా జరిగే రెండు ప్లేఆఫ్ మ్యాచ్లను మార్చి 20-21న ఫైనల్ను కరాచి వేదికగా మార్చి 25న నిర్వహించనున్నారు.
2009లో లాహోర్లో శ్రీలంక జట్టులోని ఆటగాళ్లపై ఉగ్రవాదుల దాడి అనంతరం పాక్లో టెస్టు హోదా కలిగిన ఏ జట్టు కూడా ఇప్పటివరకు పర్యటించలేదు. కాగా, గతేడాది పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ను లాహోర్ వేదికగా నిర్వహించారు. అయితే ఈ టోర్నీలో పాల్గొనే కొంత మంది విదేశీ ఆటగాళ్లు భద్రత కారణాలను చూపుతూ ఫైనల్ ఆడలేదు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో ఎలాగైనా సరే మ్యాచ్లు నిర్వహించాలని పాకిస్థాన్ బోర్డు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కరాచీలో మ్యాచ్ల నిర్వహణ కోసం చేస్తున్న భద్రతా ఏర్పాట్లను ఇంటర్నేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ కన్సల్టెంట్ రెగ్ డైకాసన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పరిశీలించింది.
ఈ బృందం భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేయడంతో కరాచీలో సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయస్థాయి క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్లో మొత్తం ఆరు ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఇందులో ప్రతి జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను తుది జట్టులోకి ఎంపిక చేసుకోవచ్చు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.