పట్టువదలని ఎల్గర్
మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్(46 పరుగులు), డస్సెన్ (11 పరుగులు) ఉన్నారు. శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్న ఇచ్చారు. డీన్ ఎల్గర్, మాక్రమ్ తొలి వికెట్కు 47 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 38 బంతుల్లోనే 31 పరుగులతో ధాటిగా ఆడుతున్న మాక్రమ్ను శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూలో ఔట్ చేశాడు. అనంతరం పీటర్సన్తో కలిసి డీన్ ఎల్గర్ రెండో వికెట్కు 46 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 93 పరుగుల వద్ద ఉండగా 28 పరుగులు చేసిన పీటర్సన్ను అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఎల్గర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడడంతో 118-2తో మూడో రోజు ఆట ముగిసింది. ఎల్గర్ పట్టు వదలకుండా పోరాడుతున్నాడు. నేటి మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవాలంటే 123 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్ గెలవాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. అయితే ఎల్గర్ను ఎంత త్వరగా ఔట్ చేస్తే భారత్కు అంత మంచి విజయవకాశాలు ఉంటాయి.
విహారి పోరాటం
అంతకు ముందు 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 266 పరుగులకు ఆలౌటైంది. రహానే(58), పుజారా(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. విహారి 40 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియా మంచి స్కోర్ సాధించడంలో సహాయపడ్డాడు. మిగతా వారిలో శార్దూల్ ఠాకూర్ 28, మాయాంక్ అగర్వాల్ 23, అశ్విన్ 16, రాహుల్ 8, బుమ్రా 7 పరుగులు చేశారు. పంత్, సిరాజ్, షమీ డకౌట్ అయ్యారు. సఫారీ బౌలర్లలో రబాడ, ఎంగిడి, జేన్సన్ మూడేసి వికెట్లు, ఒలివర్ ఒక వికెట్ తీశారు.
రహానే, పుజారా పోరాటం
అంతకు ముందు టీమిండియా వెటరన్ బ్యాటర్లు అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 111 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సౌతాఫ్రికా ముందు భారత్ మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది.