హైదరాబాద్: ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్కు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ దూరమయ్యాడు. చేతి వేలి గాయం కారణంగా అతడు ఆసియాకప్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. జట్టు వైద్యుల సలహా మేరకు షకీబ్ స్వదేశానికి తిరిగి వెళ్లాడు.
ఆసియా కప్: అతి పెద్ద వయస్కుడిగా, ధోని ఖాతాలో మరో రికార్డు
దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ అక్రమ్ ఖాన్ మాట్లాడుతూ "షకీబ్ గత కొంత కాలంగా చేతివేలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గాయంతోనే ఇన్ని రోజులు మ్యాచ్లు ఆడాడు. ఫిజియా చంద్రమోహాన్ సలహా మేరకు అతడికి విశ్రాంతి ఇచ్చాం. మరో నాలుగైదు వారాల పాటు అతడు అందుబాటులో ఉండడు" అని చెప్పారు.
"నొప్పితో భాధపడుతున్నప్పటికీ... మొదటి నాలుగు మ్యాచ్లు దేశం కోసం ఆడిన అతడికి ధన్యవాదాలు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 14 వరకు జింబాబ్వేతో జరగనున్న సిరిస్కూ షకీబ్ దూరం కానున్నాడు" అని అక్రమ్ ఖాన్ వెల్లడించాడు. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన సిరిస్లో షకీబ్ చేతివేలికి గాయమైంది.
అదే గాయంతో ఆ తర్వాత మార్చిలో కొలంబో వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీలో కూడా పాల్గొన్నాడు. ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆసియా కప్లో భాగంగా దుబాయి వేదికగా బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాక్కు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది.
ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో పాక్పై బంగ్లాదేశ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కి దూసుకెళ్లింది. శుక్రవారం దుబాయి వేదికగా జరగనున్న ఫైనల్లో భారత్-బంగ్లా తలపడనున్నాయి.