కోల్కత్తా: వీడియోకాన్ క్రికెట్ అకాడమీ వేదికగా విజయ్ స్పోర్టింగ్, కోల్కతా పోలీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన కోల్కత్తా క్రికెటర్ రాహుల్ ఘోష్ (20) పరిస్ధితి క్రమంగా మెరుగవుతోందని, అతడు కోలుకుంటున్నాడని చికిత్సను అందిస్తోన్న వైద్యులు తెలిపారు.
రాహుల్ ఘోష్ మెదడులో గడ్డకట్టిన రక్తం కూడా క్రమంగా తగ్గుతోందని డాక్టర్ బుద్దదేవ్ సాహా చెప్పారు. ప్రస్తుతం రాహుల్ ఘోష్కి ద్రవాహారం ఇస్తున్నారని, త్వరలో ఘన పదార్ధాలు కూడా ఇస్తామని సాహా అన్నారు. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కూడా రాహుల్ ఘోష్కు సూప్ ఇచ్చారని తెలిపారు.
మరికొన్ని రోజులు అతడిని వైద్యుల పరిశీలనలో ఉంచుతామని, మూడోసారి కూడా ఎంఆర్ఐ తీయాల్సి ఉందని చెప్పారు. రాహుల్ ఘోష్కు అయ్యే వైద్య ఖర్చంతా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) భరించేందుకు ముందుకొచ్చింది.

అంకిత్ కేసరి మరణించిన మరుసటి రోజున విజయ్ స్పోర్టింగ్, కోల్కతా పోలీస్ జట్ల మధ్య మంగళవారం జరిగిన బెంగాల్ క్రికెట్ సంఘం సెకండ్ డివిజన్ ప్లే ఆఫ్ మ్యాచ్లో బ్యాట్స్మన్ కొట్టిన బంతి తలకు తగలడంతో రాహుల్ ఘోష్ (19) తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రత్యర్థి బ్యాట్స్మన్ బలంగా కొట్టిన బంతిని ఆపే క్రమంలో కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ గాయపడ్డాడు. బంతి బౌన్స్ అయి అతని తలకు ఎడమ భాగంలో బలంగా తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో అతను మైదానంలోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. వెంటనే అతడిని నైటింగేల్ ఆసుపత్రికి తరలించారు. అంకిత్ ప్రాణాలు విడిచిన ఆసుపత్రిలోనే అతడికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.