INDw vs SLw: భారత మహిళా క్రికెట్ జట్టు ముక్కోణపు సిరీస్ను విజయంతో శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికా మహిళల జట్టు భారత్ తో పాటు శ్రీలంక పర్యటిస్తోంది. మూడు జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ ఈ రోజు ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్టుపై ఘన విజయం సాధించింది. వర్షం వల్ల మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ ను 39 ఓవర్లకు కుదించారు. 39 ఓవర్ల మ్యాచ్ లో శ్రీలంక జట్టు 147 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ఆ లక్ష్యాన్ని 29.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేధించింది. భారత బ్యాటర్లలో ప్రతీకా రావల్(50, హర్లీన్ డియోల్(48), స్మృతి మంధాన(43) రాణించారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ఓపెనర్ హాసిన పెరెరా 30 పరుగులతో టార్ స్కోరర్ గా నిలిచింది. కవీషా దిల్హరి 25 పరుగులు చేయగా.. అనుష్క సంజీవని 22 పరుగులతో కాస్త పర్వాలేదనిపించారు. మిగతా వారంతా రాణించలేకపోయారు. టీమిండియా బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ 2 వికెట్లు, నల్లపురెడ్డి చరణి 2 వికెట్లు, అరుంధతి ఒక వికెట్ తీశారు.

తమ మ్యాజిక్ ను ప్రదర్శించిన భారత స్పిన్నర్లు
భారత బౌలర్లు పరిస్థితులను పూర్తిగా ఉపయోగించుకున్నారు. శ్రీలంక బ్యాట్స్మెన్ను ఇక్కడి ఆర్.ప్రేమదాస స్టేడియంలో స్థిరపడనివ్వలేదు. 20 ఏళ్ల శ్రీచరణి తన తొలి మ్యాచ్ లోనే ఆకట్టుకుంది. తన ఎనిమిది ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. మీడియం పేస్ బౌలర్ కేశ్వి సుదేశ్ గౌతమ్కి కూడా ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఆమె ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినప్పటికీ, ఆమె ఆర్థికంగా బౌలింగ్ చేసింది, ఎనిమిది ఓవర్లలో 28 పరుగులు ఇచ్చింది.