భారత అమ్మాయిలకు వరుణుడు షాక్ ఇచ్చాడు. రెండో టీ20లో గెలిచి దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని సమం చేయాలనుకున్న టీమిండియా ఉమెన్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం జరగాల్సిన భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దయింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 0-1తో వెనుకంజలో కొనసాగుతోంది. తొలి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఇక సిరీస్ను సమం చేయాలంటే మంగళవారం జరగనున్న మూడో టీ20లో భారత్ తప్పక విజయం సాధించాలి. అయితే రెండో టీ20లో ఓ ఇన్నింగ్స్ అయ్యే వరకు వరుణుడు కరుణించాడు. ఆ తర్వాత తన ప్రతాపం చూపించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 177 పరుగులు చేసింది. టాజ్మిన్ బ్రిట్స్ (52; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.

సౌతాఫ్రికా ఓపెనర్లు వోల్వార్ట్ (22; 12 బంతుల్లో, 3 ఫోర్లు), బ్రిట్స్ ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించారు. నాలుగు ఓవర్లకే 43 పరుగులు సాధించారు. అయితే అయిదో ఓవర్లో వోల్వార్ట్ను పూజ పెవిలియన్కు చేర్చింది. వన్డౌన్లో వచ్చిన మరిజేన్ (20; 14 బంతుల్లో, 3 ఫోర్లు)తో కలిసి బ్రిట్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడానికి ప్రయత్నించింది. పవర్ప్లేలో దక్షిణాఫ్రికా 66 పరుగులు చేసింది.
ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. కాసేపటికే మరిజానెను దీప్తి శర్మ ఔట్ చేసింది. క్రమంగా వికెట్లు తీస్తూ సౌతాఫ్రికా స్కోరు బోర్డు కట్టడి చేయడానికి మన బౌలర్లు ప్రయత్నించారు. అయితే మరోవైపు బోసె (40; 32 బంతుల్లో, 6 ఫోర్లు) 19వ ఓవర్ వరకు క్రీజులో ఉండి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోరు అందించింది. భారత బౌలర్లలో పూజ, దీప్తి చెరో రెండు వికెట్లు, శ్రేయాంక, రాధ తలో వికెట్ తీశారు.