సూరత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో బోణీ చేసిన భారత మహిళలు మరో పోరుకు సిద్ధమయ్యారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం రాత్రి 7 గంటలకు సూరత్లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి ఆధిక్యాన్ని పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని సఫారీ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
43 ఏళ్ల వయస్సులో పతకం.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో అరుదైన రికార్డు
తొలి టీ20లో గెలిచి మంచి ఊపుమీదున్న టీమిండియా జోరుకు వరణుడు అడ్డుపడ్డాడు. రెండో టీ20లో కనీసం టాస్ కూడా పడనివ్వకుండా చేసాడు. దీంతో మూడో టీ20లో జోరు కనబరచాలని టీమిండియా మహిళలు చూస్తున్నారు. మిథాలీ రాజ్ స్థానంలో అరంగేట్రం చేసిన 15 ఏండ్ల షఫాలీ వర్మపై అందరి దృష్టి ఉండనుంది. దూకుడుగా ఆడే షఫాలీ బ్యాట్ జుళిపిస్తే మంచి ఆరంభం దక్కనుంది. ఇక కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మంచి ఫామ్లో ఉండడం కలిసొచ్చే అంశం. అయితే హర్మన్పై టీమిండియా ఎక్కువగా ఆధారపడుతోంది. హర్మన్కు తోడు స్మృతి మందన, రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి సహకారం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు.
తొలి మ్యాచ్లో భారత స్పిన్నర్లే ఎనిమిది వికెట్లు తీయడంతో ఆ విభాగంపైనే ఇరు జట్లు ఎక్కువ దృష్టి సారించే అవకాశముంది. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ మరోసారి విజృంభిస్తే.. సఫారీలకు కష్టాలు తప్పవు. రాధా యాదవ్ ఫామ్ కూడా టీమిండియాకు లాభించనుంది. పేస్, స్పిన్ బౌలర్లు సమిష్టిగా రాణిస్తే.. దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టొచ్చు.
దక్షిణాఫ్రికా డుప్రీజ్నే నమ్ముకుంది. తొలి మ్యాచ్లో భారత్ స్పిన్ను ఎదుర్కొనేందుకు డుప్రెజ్ (59) తప్ప.. దక్షిణాఫ్రికా జట్టులో మిగిలిన వారంతా అష్టకష్టాలు పడ్డారు. అయితే ఓపెనర్ లీ, లారాలు ఫామ్ అందుకుంటే ప్రొటీస్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రొటీస్ బౌలింగ్ దళం సమర్ధంగా ఉంది. తొలి మ్యాచులో టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. స్పిన్ బలహీనతను అధిగమించి రెండో మ్యాచ్లో దీటుగా పోరాడాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది.
మూడో టీ20 మ్యాచ్లో భారత్ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. గత జట్టునే కొనసాగించనుంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా చివరి రెండు మ్యాచ్లకు భారత మహిళల జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. తొలి మూడు టీ20లకు ఎంపిక చేసిన జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించింది. ఈ రోజు మూడో మ్యాచ్ జరగనుండగా.. సిరీస్లో చివరి రెండు మ్యాచ్లు అక్టోబర్ 1,4 తేదీల్లో జరుగుతాయి.