వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన యువ సంచలనం యశస్వి జైస్వాల్.. రెండో టెస్టులో కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి జట్టుకు ధనాధన్ ఓపెనింగ్ అందించిన జైస్వాల్.. తన హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడంలో విఫలమయ్యాడు. అయితే క్రికెట్లో ఇలాంటివి సహజమే అని జైస్వాల్ అన్నాడు. తన పొరపాట్ల నుంచి నేర్చుకుంటానని చెప్పాడు.
అదే సమయంలో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ గురించి కూడా జైస్వాల్ మాట్లాడాడు. కోహ్లీతో కలిసి ఆడటం తనకు దక్కిన అదృష్టమని జైస్వాల్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీని అబ్జర్వ్ చేయడం ద్వారా తను చాలా నేర్చుకుంటున్నానని చెప్పాడు. అలాగే కోహ్లీతో క్రికెట్ గురించి మాట్లాడటం తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. జైస్వాల్కు కోహ్లీ బ్యాటింగ్ పాఠాలు చెప్తూ రెండు, మూడుసార్లు కెమెరా కంటపడిన సంగతి తెలిసిందే.

'కోహ్లీ ఆడుతుంటే చూడటం, తనతో కలిసి ఆడటం రెండూ చాలా అద్భుతంగా ఉంటాయి. తనో లెజెండ్. అలాంటి ప్లేయర్తో కలిసి ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా. తనతో కలిసి ఆడటం, తన నుంచి నేర్చుకోవడం చాలా గొప్ప ఫీలింగ్. ఫీల్డ్లో, బయట కోహ్లీ చేసే శ్రమ చూస్తూ చాలా నేర్చుకోవచ్చు. అలాగే తనతో మాట్లాడటం, సలహాలు తీసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది' అని జైస్వాల్ చెప్పాడు.
ఈ సిరీస్ తొలి టెస్టులో అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఆ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏకంగా 171 పరుగులతో ఆకట్టుకొని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా అందుకున్నాడు. అయితే రెండో టెస్టుల 57 పరుగులకే అతను అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గిల్, రహానే ఇద్దరూ ఫెయిలవడంతో టీం కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కోహ్లీ చాలా పట్టుదలగా ఆడుతూ జట్టుకు మంచి స్కోరు అందించేందుకు కృషి చేస్తున్నాడు.