ఐపీఎల్ యువ సంచలనం యశస్వి జైస్వాల్కు టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కింది. రంజీల్లో కూడా అదరగొట్టిన అతను ఎడం చేతి వాటం బ్యాటర్ కావడం అతనికి బాగా కలిసొచ్చింది. ఇక ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ఎంపికయ్యాడు.
ఆ మ్యాచ్లో జైస్వాల్కు ఆడే అవకాశం దక్కకపోయినా కూడా.. టెస్టు సెటప్లో అతన్ని సెట్ చేసేందుకు సెలెక్టర్లు ప్రయత్నిస్తున్నారన్న విషయం స్పష్టమైంది. ఈ క్రమంలో విండీస్తో ఆడే టెస్టు జట్టులో అతన్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ వార్త తెలియగానే తన తండ్రి చాలా ఎమోషనల్ అయిపోయి, కన్నీరు పెట్టుకున్నట్లు జైస్వాల్ వెల్లడించాడు.

ప్రస్తుతం ఇంటికి దూరంగా ఉన్న అతను ఇంటికి వెళ్లాక తల్లి ఎలా స్పందిస్తుందని ఎగ్జయిటింగ్గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు. విండీస్ పర్యటనకు జట్టును ప్రకటించే సమయంలో తాను చాలా నెర్వస్ ఫీలయ్యానని, అయితే తన పేరు వార్తల్లో బయటకు రావడంతో తండ్రి చాలా సంతోషించాడని తెలియజేశాడు.
'ఈ వార్త తెలియగానే మా నాన్న సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా మా అమ్మను కలవలేదు. త్వరలోనే ఇంటికెళ్లి తనను కూడా కలుస్తాను. చాలా సంతోషంగా ఉంది. నా సత్తాకు తగ్గట్లు రాణించడానికి ప్రయత్నిస్తా. ఎగ్జయిట్ అయినా కూడా అక్కడకు వెళ్లి నా ఆట నేను ఆడేందుకు ట్రై చేస్తా. నా పేరు లిస్టులో ఉందా? లేదా? అని చాలా నెర్వస్ ఫీలయ్యా. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నా' అని చెప్పుకొచ్చాడు.

అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే వంటి వాళ్లు తనకు ఎన్నో విలువైన సూచనలు చేశారని చెప్పాడు. 'నా ప్రిపరేషన్స్ చాలా బాగున్నాయి. అలాగే చాలా మంది సీనియర్ ప్లేయర్లతో మాట్లాడే అవకాశం దక్కింది. నా ఆటపై ఫోకస్ పెట్టాలనే వాళ్లంతా చెప్పారు. వాళ్ల నుంచి ఒక విషయం నేర్చుకున్నా. మనం ముందడుగు ఎలా వేస్తామన్నదే ముఖ్యమని అర్థం చేసుకున్నా' అని జైస్వాల్ తెలిపాడు.
దేశవాళీల్లో కూడా అన్ని ఫార్మాట్లలో దుమ్ముదులిపిన జైస్వాల్.. ముంబై తరఫున 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఈ మ్యాచుల్లో 80.21 సగటుతో తొమ్మిది సెంచరీలతో 845 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం 2023 ఐపీఎల్లో 163.61 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన జైస్వాల్ 625 పరుగులతో అంతర్జాతీయ అరంగేట్రం చేయకముందే ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.