టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ కెరీర్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో అతను భారీ శతకం సాధించాడు. అయినా సరే ఎక్కడా తగ్గే ఆలోచనలో లేనట్లు కనిపిస్తున్నాడు. ఈ లెక్కన అతను డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యం లేదు. ఇలా తను ఆడిన తొలి మ్యాచులోనే సెంచరీతో చెలరేగడంతో జైస్వాల్పై నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
తన ప్రదర్శనపై జైస్వాల్ కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నందుకు అతను చాలా ఆనందంగా కనిపిస్తున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 143 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 14 బౌండరీలు ఉండటం గమనార్హం. తనకు ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అని జైస్వాల్ చెప్పుకొచ్చాడు.

'ఈ సెంచరీ నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. నాపై నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో కూడా బాగా రాణించాలి. టీమిండియాలో అవకాశాలు రావడం చాలా కష్టం. నాకు వచ్చింది. అందుకే అందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నా. టీం మేనేజ్మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్' అని చెప్పాడు.
తనకు టెస్టు క్రికెట్ చాలా ఇష్టమని చెప్పిన అతను.. పిచ్ గురించి కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. 'ఈ పిచ్ కొంత స్లోగా ఉంది. అవుట్ ఫీల్డ్ కూడా స్లోగా ఉంది. దీనిపై ఆడటం కష్టం. ఒక సవాల్లా ఉంది. బాగా వేడిగా కూడా ఉంది. కానీ నా దేశం కోసం ఆడాలనే కోరికతో ఆడా. ఒక్కో బంతే ఎదుర్కొంటూ నా క్రికెట్ను ఎంజాయ్ చేశా. నాకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. బంతి స్వింగ్ అవుతుంటే నేను బాగా ఎంజాయ్ చేస్తా. మేం అన్నిటి పరిస్థితుల్లో రాణించడానికి చాలా కష్టపడ్డాం' ' అని జైస్వాల్ తెలిపాడు.