భారత జట్టులో ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం టీంను చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. యువరాజ్ సింగ్ తర్వాత సరైన ఆల్రౌండర్ ఈ టీంకు దొరకలేదు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచే ఆల్రౌండర్లను సిద్ధం చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఈ క్రమంలోనే కొత్త కుర్రాళ్లపై ఫోకస్ పెట్టినట్లు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వెల్లడించాడు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ ఇద్దరినీ ఆల్రౌండర్లుగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మాంబ్రే తెలిపాడు. వీళ్లిద్దరూ కూడా తమ అండర్-19 రోజుల్లో బౌలింగ్ చేసిన ప్లేయర్లే కావడం గమనార్హం.

ఈ కారణంగానే సీనియర్ క్రికెట్ కెరీర్లో కూడా వీళ్ల బౌలింగ్ను ఉపయోగించుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. వీళ్లిద్దరూ కూడా టీంకు భవిష్యత్తులో చాలా యూజ్ అవుతారని మాంబ్రే అభిప్రాయపడ్డాడు. 'అవసరమైతే బంతితో సహకరించే ప్లేయర్లు ఉండటం మంచి విషయం' అని చెప్పాడు.
'యశస్వి, తిలక్ ఇద్దరూ బౌలింగ్ చేయడం వాళ్ల అండర్-19 రోజుల నుంచి చూస్తున్నా. వాళ్లు సత్తా ఉన్న బౌలర్లే. ఈ విషయంపై ఇంకొంచెం వర్క్ చేయాలంతే. ఇలాంటి ఆప్షన్లు దొరకడం వల్ల టీంకు చాలా ఉపయోగం ఉంటుంది. త్వరలోనే వీళ్లు బౌలింగ్ చేయడం మనందరం చూస్తాం. కొంచెం టైం పడుతుంది. కానీ వాళ్లు బౌలింగ్ కూడా మొదలు పెడతారు' అని మాంబ్రే స్పష్టం చేశాడు.
అలాగే విండీస్ టూర్లోనే అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ముఖేష్ కుమార్ కూడా చాలా వేగంగా తన ఆటను మెరుగు పరుచుకుంటున్నాడని మాంబ్రే చెప్పాడు. అతని ఎదుగుదల చాలా సంతృప్తికరంగా ఉందని మెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్లలో బంతితో ముఖేష్ ఫర్వాలేదనిపించిన సంగతి తెలిసిందే.

సీనియర్లు లేని సమయంలో అతను బాధ్యతాయుతంగా బౌలింగ్ చేస్తూ అందరి మెప్పు పొందుతున్నాడు. ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో అతను కూడా జట్టులో రెగ్యులర్ మెంబర్ అవ్వగలడని నిపుణుల భావన.