భారత్పై వెస్టిండీస్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఏ విభాగంలోనూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపించింది.
ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్లు ఎవరూ బాధ్యతాయుతంగా ఆడకపోవడం గమనార్హం. ఒకానొక దశలో 90/1 స్కోరుతో పటిష్టంగా కనిపించిన భారత జట్టు కేవలం 181 పరుగులకే కుప్పకూలిందంటేనే.. భారత బ్యాటింగ్ ఏ స్థాయిలో విఫలమైందో అర్థం చేసుకోవచ్చు.

ఇది విండీస్ గడ్డపై ఆరేళ్ల తర్వాత భారత్ ఎదుర్కొన్న తొలి ఓటమి. ఇలా భారత్పై విజయం సాధించడంపై విండీస్ సారధి షాయి హోప్ స్పందించాడు. తను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడీ విండీస్ స్టార్. 'నా వల్ల జట్టు గెలిచిందంటే అంత కన్నా సంతోషం ఏముంటుంది? ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా' అని హోప్ అన్నాడు.
'పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడే.. వేగంగా స్కోర్ చేయాలి. అలా చేయాలంటే వేగంగా పరిగెత్తాలి. మేం బాగా డబుల్స్ తీశాం. అదే మా విజయానికి ఉపయోగపడింది. ఈ విజయంతో చాలా సంతృప్తిగా ఉన్నా. ఈ సిరీసును ఎలాగైనా కైవసం చేసుకోవాలి అనేదే మా లక్ష్యం' అని చెప్పాడు.
'ఇంకొక్క మ్యాచ్ గెలవాల్సి ఉంది. బాగా ఎఫర్ట్ పెట్టాలి. ఈ రోజు మేం మంచి యాటిట్యూడ్ చూపించాం. అన్ని విభాగాల్లో దాన్ని చూపించాలి. ఈ మ్యాచ్లో మా టీం సంపూర్తిగా రాణించింది. అన్ని బాక్సులు టిక్ చేసుకొని.. చివరి గేమ్ కూడా గెలవాలని అనుకుంటున్నాం' అని హోప్ తెలిపాడు.
ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచిన హోప్.. విండీస్ను విజయ తీరాలకు చేర్చాడు. అతనికి కార్టీ (48 నాటౌట్) మంచి సహకారం అందించాడు. 63 పరుగులతో నాటౌట్గా నిలిచిన హోప్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.