వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో జట్టు తడబడినా.. ఆ తర్వాత తేరుకొని రాణించింది. అయితే 114 పరుగుల ఛేజింగ్లో ఐదు వికెట్లు కోల్పోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇదిలా వుండగా.. ఈ మ్యాచ్లో ఒక ఘటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అదేంటంటే.. టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన జెర్సీ వేసుకొని ఆడలేదు.
ఈ మ్యాచ్లో మూడో నెంబర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సూర్య.. తన జెర్సీ కాకుండా, కేరళ యంగ్స్టర్ సంజూ శాంసన్ జెర్సీ వేసుకొని కనిపించాడు. అసలే టీంలో అతన్ని తీసుకోలేదని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్కు ఈ జెర్సీ చూసి ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ ఏదో పొరపాటు జరిగిందని మాత్రం అనుకున్నారు. అయితే రెండో వన్డేలో కూడా సూర్య ఇలాగే సంజూ జెర్సీతోనే ఆడతాడని సమాచారం.

ఇలా సూర్య తన జెర్సీ వేసుకోకుండా.. సంజూ జెర్సీ వేసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని బీసీసీఐ వెల్లడించింది. సూర్య జెర్సీలో ఏదో సమస్య ఉందని, అందుకే అతను తన జెర్సీ వేసుకోలేదని తెలిపింది. ఈ క్రమంలోనే సంజూ జెర్సీ ధరించి బరిలో దిగినట్లు వివరించింది. 'సూర్యకు తన జెర్సీ సైజ్ సరిపోలేదట. ఏదో ఇబ్బందిగా ఉండటంతో ఆ జెర్సీ వేసుకోలేదు. అందుకే సంజూ జెర్సీ వేసుకున్నాడు' అని ఒక బీసీసీఐ అధికారి తెలియజేశారు.
'సూర్యకు జెర్సీ సైజ్ సరిపోలేదని మ్యాచ్కు రెండ్రోజుల ముందే మాకు తెలిసింది. అతని కొత్త జెర్సీ రావడానికి కొంచెం టైం పడుతుంది. రెండో వన్డే అయిపోయే వరకు అది రాదు. కాబట్టి రెండో వన్డేలో కూడా సంజూ జెర్సీలోనే సూర్య ఆడతాడు. టీ20 సిరీస్ ఆడే ప్లేయర్లతోపాటు దాన్ని షిప్ చేశాం' అని బీసీసీఐ వర్గాలు వివరించాయి. అంటే రెండో వన్డేలో కూడా సూర్య ఇలాగే సంజూ జెర్సీలో ఆడతాడన్నమాట.