భారత్ చేతిలో టెస్ట్ సిరీసును 1-0 తేడాతో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు.. వన్డే సిరీసుకు రెడీ అయింది. ఈ క్రమంలో తాజాగా తమ వన్డే జట్టును విండీస్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టులో రాజస్థాన్ రాయల్స్ హిట్లర్ షిమ్రాన్ హెట్మేయర్ కు కూడా చోటు దక్కడం గమనార్హం. ఈ వన్డే సీరీస్ ఈ నెల 27న మొదలవుతుంది.
మొత్తం మూడు వన్డేల్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. వీటిలో చివరి మ్యాచ్ ఆగస్టు 1వ తేదీన జరుగుతుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో.. ఇంతకుముందు విండీస్ టీమ్ తరఫున ఆడిన ప్లేయర్లు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. హెట్మేయర్ తో పాటు పేసర్ ఒషేన్ థామస్, జేడన్ సీల్స్, యానిక్ కరియాకు కూడా విండీస్ బోర్డు నుంచి పిలుపు వచ్చింది.

వీరిలో హెట్మేయర్, థామస్ ఈ జట్టు తరఫున గతంలో బాగా రాణించారు. విండీస్ లీడ్ సెలెక్టర్ డెస్మండ్ హెనేస్ వీరిద్దరి గురించి మాట్లాడుతూ.. "హెట్మేయర్ ఆట ఈ జట్టుకు పెద్ద ప్లస్ అవుతుంది. థామస్ కొత్త బంతితో వికెట్లు తీయగలడు. వీళ్ళిద్దరూ ప్రస్తుత టీంలో సరిగ్గా సరిపోతారు" అన్నాడు.
మిడిల్ ఆర్డర్ లో హెట్మేయర్ బ్యాటింగ్ జట్టుకు బాగా యూజ్ అవుతుందని, అతనో మంచి ఫినిషర్ కూడా అని హేనెస్ అభిప్రాయపడ్డాడు. కొన్ని రోజుల క్రితం వరల్డ్ కప్ క్వాలిఫైయర్లలో విండీస్ టీమ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఈ టీమ్ వరల్డ్ కప్ ఆడటం లేదు.
విండీస్ జట్టు: షాయి హోప్ (కెప్టెన్), రోవ్ మన్ పావెల్, అలిక్ అతనాజ్, యానిక కరియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మేయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోతీ, జేడెన్ సీల్స్, రోమెరియో షెపర్డ్, కెవిన్ సిన్ క్లైర్, ఓషేన్ థామస్