భారత్తో జరుగుతున్న తొలి టీ20లో విండీస్ బ్యాటింగ్ యూనిట్ తడబడింది. కేవలం ఇద్దరు, ముగ్గురు బ్యాటర్లు అనుకున్న స్థాయిలో రాణించారు. దీంతో ఆ జట్టు ఆశించిన భారీ స్కోరు చేయలేకపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్కు కైల్ మేయర్స్ (1) విఫలమైనా.. బ్రాండన్ కింగ్ (28) మంచి ఆరంభం అందించాడు.
అతని తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (41), రావ్మెన్ పావెల్ (48) ఇద్దరూ మంచి ఇన్నింగ్సులు ఆడారు. కానీ భారత బౌలర్లు టైట్ లైన్స్ మెయింటైన్ చేయడంతో భారీ షాట్లు ఆడటానికి వీళ్లిద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చింది. మిగతా బ్యాటర్లలో షిమ్రాన్ హెట్మెయర్ (10), జాన్సన్ చార్లెస్ (3), రొమేరియో షెఫర్డ్ (4 నాటౌట్), జేసన్ హోల్డర్ (6 నాటౌట్) ఎవరూ పెద్దగా రాణించలేదు.

పూరన్, పావెల్ కనుక మరికొంత సేపు క్రీజులో నిలబడి ఉంటే ఆ జట్టు.. భారత్ ముందు బలమైన టార్గెట్ ఉంచగలిగేది. కానీ భారత బౌలర్లు ఆరంభం నుంచే విండీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఐదో ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్న యుజ్వేంద్ర చాహల్ భారత్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే తిలక్ వర్మ సూపర్ క్యాచ్తో చార్లెస్ను పెవిలియన్ చేర్చాడు.
ఇలా వరుస విరామాల్లో విండీస్ వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులే చేయగలిగింది. బ్యాటింగ్కు సహకరించే పిచ్పై భారత బౌలర్ల ప్రదర్శనను నిపుణులు మెచ్చుకుంటున్నారు.
అలాగే బౌలర్లను చక్కగా ఉపయోగించుకున్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా చెరో వికెట్ తీసుకున్నారు.