వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో విండీస్ కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్లో ఆ టీం 150 పరుగులు మాత్రమే చేసింది. ఈ రెండు ఇన్నింగ్సుల్లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లో ఆకాష్ చోప్రా వివరించాడు. ఈ క్రమంలోనే డొమినికాలో విండీస్ తయారు చేయించిన పిచ్ గురించి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'రెండో టెస్టు జరిగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో వెస్టిండీస్ డిఫరెంట్ పిచ్ తయారు చేయించొచ్చు. ఎందుకంటే ఇలాంటి పిచ్పై ఆడటం అంటే.. మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే. ఇలాంటి స్పిన్నింగ్ పిచ్పై భారత్ను ఓడించే అవకాశం వాళ్లకు ఏమాత్రం లేదు' అని తేల్చేశాడు.

అదే సమయంలో రెండు జట్ల మధ్య చాలా గ్యాప్ ఉందని చోప్రా అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భాగం కాబట్టి ఈ మ్యాచ్ కీలకమేనని, కానీ ఈ రెండు టీమ్స్ మధ్య ఏమాత్రం పోటీ లేదని అభిప్రాయపడ్డాడు. అలాగే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక మాన్స్టర్ అన్నాడు. 'అతని క్లాస్ చూడండి. అతను వేసిన బంతి బ్యాటర్కు దూరంగా వెళ్తే అవుట్సైడ్ ఎడ్జ్ లభిస్తుంది' అని చెప్పాడు.
'ఆ తర్వాతి బంతినే స్లో డెలివరీ వేస్తున్నాడు. అది పిచ్ పడిన తర్వాత టర్న్ అవుతుంది. అది బ్యాటర్ ప్యాడ్లకు తగులుతుంది. లేదంటే బ్యాట్, ప్యాడ్ మధ్య గ్యాప్లో నుంచి వెళ్లి వికెట్లను పడగొడుతుంది. అది కూడా జరగకపోతే బ్యాటుకు, ప్యాడ్కు తగిలి షార్ట్ లెగ్కు క్యాచ్ వెళ్తుంది' అని అశ్విన్ బౌలింగ్ను వివరించాడీ మాజీ క్రికెటర్. వెస్టిండీస్పై బౌలింగ్ చేయడం అశ్విన్కు బాగా ఇష్టమని, ఈ మ్యాచ్లో 12 వికెట్లతో ఆ విషయాన్ని మరోసారి నిరూపించాడని చెప్పాడు.