తమకు ఇండియా టీం గురించి బాగా తెలుసునని, దానికితోడు బాగా తెలిసిన పిచ్లపై ఆడుతున్నామని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ క్రెగ్ బ్రాత్వైట్ అన్నాడు. భారత్, విండీస్ రెండు జట్లు ఈ నెల 12 నుంచి తొలి టెస్టు ఆడనున్నాయి. డొమినికా వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. కెన్నింగ్టన్ ఓవల్లో భారత బృందం ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటోంది.
ఈ క్రమంలోనే తాము ఈ టెస్టు సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని విండీస్ కెప్టెన్ చెప్పాడు. ఇటీవలే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో వెస్టిండీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు ఓటములతో వరల్డ్ కప్ రేసు నుంచి ఈ టీం తప్పుకుంది. ఆ బాధ నుంచి తేరుకొని, తమ డబ్ల్యూటీసీ సైకిల్ను పాజిటివ్గా ఆరంభించాలని విండీస్ భావిస్తోంది. ఇదే విషయాన్ని బ్రాత్వైట్ చెప్పాడు.

వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ నుంచి వెస్టిండీస్ నిష్క్రమించడంతో.. ఆ టీంలో ఉన్న జేసన్ హల్డర్, అల్జారీ జోసెఫ్ ఇద్దరూ విండీస్ టెస్టు జట్టుతో కలిశారు. కరీబియన్ జట్టు చివరగా భారత్ను 2002లో ఓడించింది. ఆ తర్వాత నాలుగు సార్లు ఈ రెండు జట్లు తలపడితే ఒక్కసారి కూడా విండీస్ విజయం సాధించలేకపోయింది. చక్కగా ప్రిపేర్ అయి, తమ ప్లాన్లు సరిగా అమలు చేయాలని అనుకుంటున్నట్లు బ్రాత్వైట్ తెలిపాడు.
'మనం ఎలా ప్రిపేర్ అయ్యామనేది ముఖ్యం. పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుసు. పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు సాధారణంగా ఒక ఐడియా ఉంటుంది. అలాగే టీమిండియా ఎలా ఆడుతుందో కూడా మాకు బాగా తెలుసు. కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అవడం చాలా ముఖ్యం. అలాగే బౌలర్లుగా, బ్యాటర్లుగా రెండు విభాగాల్లో ప్లాన్లు సరిగా అర్థం చేసుకోవాలి. వాటిని ఎలా అమలు చేస్తామనేదే ఫలితాన్ని నిర్దేశిస్తుంది' అని బ్రాత్వైట్ అన్నాడు.
'డొమినికాలో తొలి మ్యాచ్ జరుగుతుంది. అక్కడి ఫ్యాన్స్ అందరూ స్టేడియానికి వచ్చి మాకు మద్దతివ్వాలని కోరుతున్నాం. మా కుర్రాళ్లు కూడా ఈ రెండు టెస్టుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు' అని వెల్లడించాడు. మరి భారత్ను ఎదుర్కోవడానికి వాళ్లు ఎలాంటి ప్లాన్లు వేస్తారో చూడాలి.