టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో శుభ్మన్ గిల్ అవుటైన తర్వాత క్రీజులోకి కోహ్లీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో చాలా పట్టుదలగా ఆడిన కోహ్లీ.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో మరో అడుగు ముందుకేశాడు.
మాజీ లెజెండ్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను కోహ్లీ దాటేశాడు. సెహ్వాగ్ తన కెరీర్లో 103 టెస్టు మ్యాచుల్లో 49.43 సగటుతో 8503 పరుగులు చేశాడు. వీటిలో 23 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డొమినికా టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ ఈ ఫార్మాట్లో చేసిన పరుగుల సంఖ్య 8515కు చేరింది. అంటే అతను సెహ్వాగ్ను దాటేశాడన్నమాట. కోహ్లీకి ఈ మ్యాచ్ 110వది కావడం గమనార్హం.

ఇప్పటి వరకు కోహ్లీ టెస్టుల్లో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో 200 టెస్టు మ్యాచులు ఆడాడు. వీటిలో 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో సచిన్ 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
ద్రావిడ్ ఓవరాల్గా 163 టెస్టులు ఆడాడు. వీటిలో 52.63 సగటుతో 13625 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో ద్రావిడ్ 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో మరో లెజెండ్ సునీల్ గవాస్కర్ ఉన్నాడు. టెస్టు క్రికెట్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాటర్ ఇతనే. గవాస్కర్ 125 టెస్టుల్లో 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు.
గవాస్కర్ కెరీర్లో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక నాలుగో స్థానంలో మరో టీమిండియా లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. అతను 134 టెస్టుల్లో 45.97 సగటుతో 8781 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు సెహ్వాగ్ను దాటేసిన కోహ్లీ.. ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు.