వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న అతను.. ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపూ మంచి పట్టుదలగా కనిపించిన అతను రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది కోహ్లీ కెరీర్లో 29వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం.
180 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ ఆ తర్వాత కూడా చక్కగా ఆడాడు. అయితే 121 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్విక్ సింగిల్ తీయబోయి రనౌట్ అయ్యాడు. కోహ్లీ కెరీర్లో టెస్టుల్లో ఇలా రనౌట్ అవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. లెగ్ సైడ్ బంతిని ఆడిన కోహ్లీ.. పరుగు తీద్దామా? వద్దా? అని సంకోచించాడు. అవతలి ఎండ్లో ఉన్న జడేజా వైపు చూశాడు.

అతను ముందుకే రావడంతో ఫీల్డర్ జోసెఫ్ వైపు చూసి మళ్లీ పరుగు మొదలు పెట్టాడు. అయితే జోసెఫ్ డైరెక్ట్ త్రో విసిరాడు. అప్పటికే దాదాపు అవతలి ఎండ్ చేరుకున్న కోహ్లీ డైవ్ కూడా చేశాడు. కానీ కేవలం రెండు అంగుళాల గ్యాప్లో క్రీజును మిస్ అయ్యాడు. దీంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే జడేజా (61) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (56) మరోసారి బ్యాటుతో మెరిశాడు.
ఇషాన్ కిషన్ (25) పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే అశ్విన్ రాణించడంతో భారత జట్టు 438 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బరిలో దిగిన వెస్టిండీస్ను రవీంద్ర జడేజా ఆరంభంలోనే దెబ్బతీశాడు. టగనరైన్ చందర్పాల్ (33)ను అవుట్ చేశాడు. జడ్డూ బౌలింగ్లో అశ్విన్కు క్యాచ్ ఇచ్చిన చందర్పాల్ పెవిలియన్ చేరాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 86/1 స్కోరుతో నిలిచింది.