వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ చేసిన పని ఎంతో మంది మనసులు గెలుచుకుంది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబాన్ని కోహ్లీ కలిశాడు. స్టేడియంలో నిలబడి 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ ఒక చిన్నారి కేకలు వేయడం చూశాడీ మోడ్రన్ గ్రేట్.
దీంతో అక్కడకు వెళ్లిన అతను ఆ కుటుంబాన్ని, చిన్నారిని కలిశాడు. ఈ సమయంలో తను స్వయంగా చేసిన బ్రేస్లెట్ను ఆ చిన్నారి.. కోహ్లీకి అందజేశాడు. 'ఇది నేను వేసుకోనా?' అంటూ దాన్ని తీసుకున్న కోహ్లీ.. ఆ కుటుంబం ముందే దాన్ని తన చేతికి వేసుకున్నాడు. అనంతరం ఆ కుటుంబంతో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ కుటుంబాన్ని కలవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్.. కోహ్లీ మంచి మనసును తెగ మెచ్చుకుంటున్నారు. ఈ ఘటన గురించి ఆ చిన్నారి పాప కూడా మాట్లాడింది.
'నేను కోహ్లీ కోసం అరుస్తుంటే తను విని నా దగ్గరకు వచ్చాడు. అప్పుడే నేను నా చేతుల్తో చేసిన బ్రేస్లెట్ను తనకు ఇచ్చా' అని ఆ పాప చెప్పింది. కోహ్లీ ఇలా ఆ బ్రేస్లెట్ తమ ముందే వేసుకోవడం చూసి ఆనందంతో తన కళ్లలో నీళ్లు తిరిగాయని ఆ పాప తండ్రి చెప్పారు. తమ కుటుంబానికి క్రికెట్ అంటే చాలా ఇష్టమని, కోహ్లీ అంటే ఇంకా ఇష్టమని అన్నారు.
'నా కూతురు పిలుస్తుంటే కోహ్లీ అక్కడకు వచ్చాడు. చాలా చక్కగా మాట్లాడి పాప ఇచ్చి బ్రేస్ లెట్ వేసుకున్నాడు. అప్పుడు సంతోషంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కోహ్లీ చాలా మర్యాదగా, డౌన్ టు ఎర్త్ మనస్తత్వంతో ఉన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది' అని సదరు తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.