విండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ సంచలనం సృష్టించాడు. సుమారు ఐదేళ్లుగా విదేశీ గడ్డపై సెంచరీ చేయని కోహ్లీ తనదైన స్టైల్లో ఆ ఎదురు చూపులకు బ్రేక్ వేశాడు. వ్యక్తిగత స్కోరు 87 పరుగుల వద్ద రెండో రోజు ఆటను మొదలు పెట్టిన కోహ్లీ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఆ తర్వాత చూడచక్కని బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సెంచరీ చేసిన వెంటనే అవతలి ఎండ్లో ఉన్న రవీంద్ర జడేజాను కౌగిలించుకున్న కోహ్లీ.. తమ టీం డగౌట్ వైపు బ్యాట్ చూపించాడు. అనంతరం శుభ్మన్ గిల్ తరహాలో ముందుకు వంగి సెంచరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ వెంటనే తన మెడలో ఎప్పుడూ ఉండే ఎంగేజ్మెంట్ రింగ్ను తీసి అందరికీ చూపించి, దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇది కోహ్లీ కెరీర్లో 76వ అంతర్జాతీయ శతకం కావడం గమనార్హం.

అంతేకాదు, టెస్టుల్లో అతనికి ఇది 29వ సెంచరీ. దీంతో టెస్టుల్లో 29 సెంచరీలు బాదిన ప్లేయర్గా ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్మన్ రికార్డును సమం చేశాడీ మోడ్రన్ గ్రేట్. ఈ సెంచరీని కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్న విధానం నెట్టింట వైరల్ అవుతోంది. గిల్ స్టైల్లో కోహ్లీ సెలబ్రేట్ చేసుకోవడం ఫ్యాన్స్కు తెగ నచ్చింది. అలాగే తన ఎంగేజ్మెంట్ రింగ్ను కోహ్లీ ముద్దాడటాన్ని కూడా ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.
దీనిపై కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా రియాక్ట్ అయింది. తన ఇన్స్టాలో కోహ్లీ సెంచరీ చేసిన క్షణాలను పోస్ట్ చేసిన ఆమె.. ఆ ఫొటోపై హర్ట్ సింబల్ ఉంచింది. ఈ ఫొటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సెంచరీతో 500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ బాదిన తొలి క్రికెటర్గా కోహ్లీ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.