వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకుంది. కొత్త కుర్రాళ్లకు ఆడే అవకాశం కల్పించాలని అనుకుంది. అందుకే ఎప్పుడూ ఫాలో అయ్యే టీం సెటప్లో కొన్ని మార్పులు చేసింది.
ఈ క్రమంలోనే ఎప్పుడూ ఓపెనర్గా వచ్చే రోహిత్ శర్మ రాలేదు. అతని స్థానంలో శుభ్మన్ గిల్కు జోడీగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు వచ్చాడు. అతను ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక వన్ డౌన్లో వచ్చే విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్కు రాలేదు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. కానీ అతను మాత్రం ఫెయిలయ్యాడు.

వీళ్లు అవుటైన తర్వాత కూడా లోయర్ ఆర్డర్లో అంతగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి వారిని ముందుగా బ్యాటింగ్కు పంపారు. ఇక ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత చివర్లో రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం క్రీజులోకి రాలేదు.
ఇలా ఒక మ్యాచ్లో తను ఉన్నప్పుడు, ఇన్ని వికెట్లు పడినా కూడా బ్యాటింగ్కు రాకపోవడం కోహ్లీకి ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటి వరకు టీమిండియా ఐదు, అంతకన్నా ఎక్కువ వికెట్లు కోల్పోయిన ప్రతిసారీ కోహ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం కెరీర్లో తొలిసారి ఇన్ని వికెట్లు పడినా కూడా బ్యాటింగ్కు రాలేదు.
అంతేకాదు, ఈ మ్యాచ్లో జడేజా బౌలింగ్ వేసినప్పుడు కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో వన్డేల్లో అత్యధిక క్యాచులు అందుకున్న ప్లేయర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడీ మోడ్రన్ గ్రేట్. ఈ మ్యాచ్లో కోహ్లీ తన 142వ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కివీస్ లెజెండ్ రాస్ టేలర్ (142) రికార్డును సమం చేశాడు.
కోహ్లీ 275 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. అయితే టేలర్ కేవలం 236 మ్యాచుల్లోనే 142 క్యాచులు అందుకోవడం గమనార్హం. ఇక వీళ్లిద్దరి కన్నా ముందు ఈ జాబితాలో మహేల జయవర్దనే (218), రికీ పాంటింగ్ (160), మహమ్మద్ అజారుద్దీన్ (156) ఉన్నారు.