టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్ తన అరంగేట్ర సిరీసులోనే చెలరేగాడు. తొలిసారి ఇండియా జెర్సీలో బరిలో దిగిన అతను ఏకంగా 171 పరుగులు చేశాడు. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీసులో జైస్వాల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ తొలి టెస్టులో అతను భారీ శతకంతో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టులో కూడా రాణించాడు.
ట్రినిడాడ్ వేదికగా జరిగిన మ్యాచులో మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అతను.. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ తో కలిసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ వంటి వాళ్లు జైస్వాల్ ను వన్డే వరల్డ్ కప్ లో ఆడించాలని సూచించారు. ఇలాంటి ఆటగాళ్లు జట్టుకు కచ్చితంగా పెద్ద ప్లస్ అవుతారని చెప్పారు.

అయితే అతనికి ఆ ఛాన్స్ లేదని వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అంటున్నాడు. ఇటీవల ఈ విషయంపై మాట్లాడిన డీకే.. "ఒక ఎడం చేతి వాటం బ్యాటర్ మరో పదేళ్లు ఆడేలా కనిపిస్తున్నాడు. ఎలాంటి బంతులు వదిలేయాలి? వేటిని డిఫెండ్ చేసుకోవాలో తనకు బాగా తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా భారీ షాట్లు ఆడే సత్తా ఉన్న ప్లేయర్" అని చెప్పాడు.
"కానీ ఆ కుర్రాడు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఆడటం మాత్రం అసాధ్యం అనిపిస్తోంది. ఆ తర్వాత అతన్ని ఎవరూ ఆపలేరు" అని డీకే అన్నాడు. ఈ మాటలు జైస్వాల్ ను ఉద్దేశించి అన్నట్లు అందరికీ అర్థమైంది. అలాగే అతను వరల్డ్ కప్ ఆడలేడని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఎందుకంటే జైస్వాల్ ను చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో ఆడే జట్టుకు బీసీసీఐ ఎంపిక చేసింది.
సరిగ్గా వరల్డ్ కప్ మొదలైన సమయంలోనే ఆసియా క్రీడలు జరుగుతాయి. కాబట్టి జైస్వాల్ ఈ వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ లేదు. అయితే భవిష్యత్తులో గిల్, జైస్వాల్ ఇద్దరే టీమిండియా ఓపెనర్లుగా ఉంటారని అందరూ అంటున్నారు.