విండీస్ పర్యటనతో భారత జట్టులో చాలా కీలక మార్పులు చేయాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే కొందరు వెటరన్ ప్లేయర్లను పక్కన పెట్టేసి, కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రకటించిన వన్డే, టెస్టు జట్లను చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే బీసీసీఐ ఇంకా టీ20 జట్టును ప్రకటించలేదు.
ఈ క్రమంలోనే టీ20 జట్టు సెలెక్షన్పై ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితర సీనీయర్లను టీ20లకు దూరంగా ఉంచాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. విండీస్ టూర్ నుంచి కొత్త మొఖాలతో కూడిన టీ20 జట్టును ఆడించాలని అనుకుంటున్నారని సమచారం. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అదరగొట్టిన కుర్రాళ్లకు ఈ సిరీస్లో అవకాశం కల్పిస్తారట.

కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతంగా రాణించిన ఫినిషర్ రింకూ సింగ్ను ఈ సిరీస్కు ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అలాగే గిల్, జైస్వాల్ వంటి వారితోపాటు రుతురాజ్ను కూడా సెలెక్ట్ చేయాలని అమనుకుంటున్నారు. ఈ సిరీసులో భారత జట్టుకు హార్దిక్ పాండ్యానే కెప్టెన్సీ చేస్తాడు. అతని డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ సేవలందించనున్నాడు.
ఈ నేపథ్యంలోనే తెలుగు కుర్రాడు తిలక్ వర్మను కూడా విండీస్ పర్యటనకు పంపాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారట. ఐపీఎల్లో ముంబై తరఫున తిలక్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు మిడిలార్డర్కు వెన్నెముకలా మారాడీ హైదరాబాద్ యువకుడు. ముఖ్యంగా రెండో ఎలిమినేటర్లో అతను ఆడిన విధ్వంసకర ఇననింగ్స్ను ఫ్యాన్స్ ఇప్పుడప్పుడే మర్చిపోలేరు.
ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే వీరికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు అనుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే విండీస్ టూర్లో భారత్ తరఫున తిలక్ వర్మ అరంగేట్రం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి బీసీసీఐ సెలెక్టర్లు ఈ జట్టును ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.