వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. కొన్ని రోజుల క్రితమే వన్డే, టెస్టు జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టీ20 టీంను కూడా ప్రకటించింది. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మకు టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. టెస్టు టీంలో కూడా జైస్వాల్ స్థానం దక్కించుకున్నాడు. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం అతనికి అవకాశం దక్కలేదు.
ఈ పర్యటనలో మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు టీంలను బీసీసీఐ ప్రకటించింది. ముఖ్యంగా వన్డే, టెస్టు టీమ్స్లో కోహ్లీ, రోహిత్, జడేజా వంటి సీనియర్లకు పెద్ద పీట వేసింది. అదే సమయంలో టీ20 ఫార్మాట్లో మాత్రం హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్లకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే కొంతమంది ప్లేయర్లు మాత్రం మూడు ఫార్మాట్లలో స్థానం దక్కించుకున్నారు.

ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్ కనబరుస్తూ అందరి దృష్టినీ ఆకర్షించిన ఓపెనర్ శుభ్మన్ గిల్. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో టెస్టుల్లో కూడా అతని స్థానం పదిలమైంది. దీంతో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న అతను.. వన్డేల్లో ప్రస్తుతం రెగ్యులర్ ఓపెనర్గా ఉన్నాడు. ఈ రెండు ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్ ఆరంభిస్తాడనే సంగతి తెలిసిందే. టీ20ల్లో కూడా కీలక ప్లేయర్గా ఎదిగిన గిల్.. మూడు ఫార్మాట్లలో ఆడనున్నాడు.
ఇక చాలా కాలం నుంచి భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకుంటున్నా.. ఆడే అవకాశం దక్కని ప్లేయర్ ఇషాన్ కిషన్. ఈసారి కూడా విండీస్ టెస్టుల్లో అతనికి అవకాశం ఇచ్చారు. తొలి మ్యాచ్లో అతను అరంగేట్రం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక వన్డేల్లో కూడా మిడిలార్డర్లో అతన్ని ఆడించేందుకు రోహిత్ కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు. టీ20ల్లో గిల్తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నది అతనే. దీంతో మూడు ఫార్మాట్లలో అతనికి స్థానం దక్కింది.
ఇక ఆల్రౌండర్ కోటాలో అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్ అక్షర్ పటేల్. ఏ ఫార్మాట్ అయినా సరే రాణిస్తున్న అతన్ని కూడా మూడు ఫార్మాట్లలో సెలెక్టర్లను ఎంపిక చేశారు. అయితే టెస్టులు, వన్డేల్లో జడేజా ఉండటంతో అక్షర్కు ఆడే అవకాశం రాకపోవచ్చు. టీ20ల్లో మాత్రం అతను కచ్చితంగా ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మూడు ఫార్మాట్లలో అవకాశం దక్కించుకున్న చివరి ప్లేయర్ ముఖేష్ కుమార్.
ఈ బెంగాల్ పేసర్పై బీసీసీఐ సెలెక్టర్లు బాగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. దేశవాళీల్లో అద్భుతంగా రాణించిన అతను.. ఐపీఎల్లో కొంత తేలిపోయాడు. కానీ ముఖేష్ ట్యాలెంట్పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు.. సీనియర్లు లేని పేస్ బౌలింగ్ దళంలో ముఖేష్ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అతన్ని టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లకు ఎంపిక చేశారు. ఈ పర్యటనలోనే అతను భారత్ తరఫున అరంగేట్రం చేయడం గ్యారంటీ.