భారత్తో ఆడాల్సిన టెస్టు సిరీస్ షెడ్యూల్తో వెస్టిండీస్ జట్టుకు పెద్ద సమస్య వచ్చి పడింది. వచ్చే నెల 12న భారత్, విండీస్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ జట్టు వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఆడుతోంది. ఈ క్వాలిఫైయర్స్ ఫైనల్ ముగిసేది జులై 9న. అంటే ఇది ముగిసిన మూడు రోజుల్లోనే భారత్తో టెస్టులు ఆడాల్సి ఉంటుందా జట్టు.
దానికితోడు వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ జరుగుతోంది జింబాబ్వేలో. ఇక్కడి నుంచి భారత్తో తొలి టెస్టు జరిగే డొమినికాకు రావాలంటేనే రెండ్రోజులు పడుతుంది. అంటే ఇక్కడకు చేరుకున్నా కూడా కేవలం ఒక్క రోజు రెస్ట్ తీసుకొని ఐదు రోజుల పాటు ఆటగాళ్లు ఆడాల్సి ఉంటుంది. దీంతో విండీస్ క్రికెట్ బోర్డుకు పెద్ద తలనొప్పి వచ్చిపడింది.

ముఖ్యంగా విండీస్ జట్టులో అన్ని ఫార్మాట్లు ఆడే జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రోస్టన్ ఛేజ్, అల్జారీ జోసెఫ్ తదితరులు ప్రస్తుతం వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఆడుతున్నారు. భారత్తో టెస్టులు ఆడే జట్టులో వీళ్ల పేర్లను కూడా విండీస్ బోర్డు ప్రకటించింది. దీంతో వీళ్లకు ఈ షెడ్యూల్ సమస్యాత్మకంగా మారింది. ఈ సమస్యను ఎలాగైనా అధిగమించేందుకు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రయత్నిస్తోంది.
దీని గురించి ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతినిధులు మాట్లాడుతూ.. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఫైనల్కు చేరడమే తమ లక్ష్యమని, దీంతో తాము వరల్డ్ కప్కు అర్హత సాధిస్తామని చెప్పారు. ఈ ఫైనల్ ఓడినా, గెలిచినా అర్థం లేనిదని అభిప్రాయపడ్డారు. దీంతో తమ జట్టు ఫైనల్ చేరితే.. ప్రధాన ఆటగాళ్లందర్నీ భారత్తో సిరీస్ కోసం వెనక్కు పిలవాలని విండీస్ బోర్డు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సిరీస్ కోసం జులై 1వ తేదీనే విండీస్ చేరుకోవాలని భారత జట్టు అనుకుంటోందట. తద్వారా జెట్ లాగ్ పోతుందని, ఆటగాళ్లకు కూడా పరిస్థితులకు అలవాటు పడేందుకు సమయం దొరుకుతుందని బీసీసీఐ భావిస్తోంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ను భారత్ ఈ సిరీస్తోనే మొదలు పెడుతుంది. కాబట్టి ఈ సిరీస్ ఎలాగైనా గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.