టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా కొంత కాలంగా పేలవ ఫామ్లో ఉన్నాడు. అయితే దీన్ని ఎవరూ గుర్తించడం లేదని మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. గతేడాది ఏప్రిల్లో గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన పాండ్యా అద్భుతమైన ఫామ్ కనబర్చాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి అతని ఫామ్ పోయింది.
ఈ సీజన్లో గుజరాత్ ఫైనల్ వరకు చేరినా కూడా పాండ్యా పెద్దగా రాణించలేదు. ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీసులో కూడా పాండ్యా ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఈ సిరీసులో రెండు వన్డేలు ఆడిన అతను కేవలం 12 పరుగులే చేసి, ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. మూడో వన్డేలో అయినా అతను రాణిస్తాడని టీం కోరుకుంటోంది.

రెండో వన్డేలో అతని కెప్టెన్సీ కూడా అంతంతమాత్రంగానే కనిపించింది. ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో పాండ్యా విఫలమయ్యాడు. అలాగే తను కూడా బంతితో పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇక అతని బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏమాత్రం జట్టుకు ఉపయోగపడటం లేదు.
ఇలా పాండ్యా ఫామ్లో లేకపోవడం ఎవరూ పెద్దగా గుర్తించడం లేదని ఆకాష్ చోప్రా అన్నాడు. 'పాండ్యా ఈసారి ఐపీఎల్లో కూడా పెద్దగా రాణించలేదు. అతని బ్యాటింగ్ పొజిషన్పై నాకైతే క్లారిటీ కనిపించడం లేదు. తను రాణించకపోతే టీమిండియాకు పెద్ద కష్టం వచ్చినట్లే' అని చెప్పాడు. అలాగే యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్ ఆట గురించి కూడా మాట్లాడాడు.
ప్రస్తుతానికైతే ఉమ్రాన్ కన్నా శార్దూల్ సెలెక్షన్ ప్రాసెస్లో ముందు ఉన్నాడని చోప్రా అన్నాడు. అయితే ఉమ్రాన్కు కూడా అనుకున్న అవకాశాలు రావడం లేదని చెప్పాడు. అతన్ని జట్టులోకి తీసుకున్నా కూడా.. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించడం లేదని గుర్తుచేశాడు. ఉమ్రాన్ను టీమిండియా సరిగా యూజ్ చేసుకోవడం లేదని పలువురు మాజీలు ఇప్పటికే విమర్శించిన సంగతి తెలిసిందే.