వెస్టిండీస్ పై టెస్టు సీరీస్ నెగ్గిన భారత జట్టు.. వన్డే సిరీస్ కోసం రెడీ అవుతోంది. అయితే ఈ సీరీస్ మొదలవడానికి ముందే టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐపై కోపం వచ్చేసిందట. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్ళు అక్కడి నుంచి బార్బడోస్ చేరుకోవాల్సి ఉంది. దీని కోసం రాత్రి 11 గంటలకు బీసీసీఐ విమానం టికెట్లను బుక్ చేసింది.
కానీ ఆ టైంలో ఫ్లైట్ రాలేదు. బాగా లేట్ అయిన విమానం తెల్లవారు జామున 3 గంటలకు వచ్చింది. ఆ టైంలో విమానం ఎక్కడంతో గురువారం నాడు తొలి వన్డేకు ముందు తగిన విశ్రాంతి లభించలేదని టీమిండియా ప్లేయర్లు మండి పడ్డారని సమాచారం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీసీసీఐకి ఆటగాళ్ళు లేఖ కూడా రాశారట.

దీనిపై స్పందించిన బీసీసీఐ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ప్లేయర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం. "టీమ్ అంతా 8.40కి హోటల్ ఖాళీ చేసింది. అయితే ఎయిర్ పోర్టులో చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. దీంతో ఇకపై ఆటగాళ్లకు తెల్లవారు జామున ఫ్లైట్ లు బుక్ చేయాలని, అంతేకాని లేట్ నైట్ విమానాలు వద్దని మేనేజ్ మెంట్ కోరింది" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పిందట. తర్వాత షెడ్యూల్ నుంచి జాగ్రత్త పడతామని కూడా చెప్పిందట. కాగా వన్డేల్లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ తదితరులు ఇప్పటికే బార్బడోస్ చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడే టీమిండియా తొలి రెండు వన్డేలు ఆడుతుంది.
మూడు వన్డేల ఈ సిరీసులో చివరి వన్డే ఆగష్టు 1న ట్రినిడాడ్ వేదికగా జరుగుతుంది. విండీస్ పై టెస్ట్ సిరీస్ విజయంతో పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా ఈ సీరీస్ కూడా గెలిచి, వన్డే వరల్డ్ కప్ ముందు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని చూస్తోంది.