వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే భారత బృందం అంతా విండీస్ చేరుకుంది. అక్కడ టీమిండియా స్టార్లు తమ నెట్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. కెన్నింగ్టన్ ఓవల్లో ఈ ప్రాక్టీస్ సెషన్ సమయంలో టీమిండియాను ఒక స్పెషల్ అతిథి కలిశారు. అతనే విండీస్ దిగ్గజం, మాజీ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్.. అక్కడకు వచ్చారు.
గార్ఫీల్డ్ను చూడగానే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వాళ్లు అతని దగ్గరకు వెళ్లి కలిశారు. గార్ఫీల్డ్తో ఆట గురించి కాసేపు ముచ్చటించారు. అనంతరం టీమండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వచ్చి గార్ఫీల్డ్ను కలిశాడు. తనతోపాటు శుభ్మన్ గిల్ను తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఈ సందర్భంగా భారత్లో గిల్ చాలా ఎగ్జయిటింగ్ ట్యాలెంట్ అని పరిచయం చేయడం గమనార్హం.

ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ను కూడా ద్రావిడ్ పరిచయం చేశాడు. వీరితోపాటు అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ కూడా వెళ్లి గార్ఫీల్డ్ను కలిశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. 'గ్రేట్నెస్ ముందు నిలబడితే..' అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. విండీస్లో ఇప్పటి వరకు ఆడిన అతిగొప్ప ఆల్రౌండర్లలో గార్ఫీల్డ్ ఒకడు.
తన గౌరవార్ధం కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఒక పెవిలియన్కు గార్ఫీల్డ్ పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం గార్ఫీల్డ్ వయసు 86 ఏళ్లు. అయినా క్రికెట్ గురించి టీమిండియా ఆఠగాళ్లతో ఉత్సాహంగా మాట్లాడాడీ లెజెండ్. గార్ఫీల్డ్ను కలవడం చాలా సంతోషంగా ఉందని, చిన్నతనంలో చూసిన మ్యాచులన్నీ గుర్తొచ్చాయని అశ్విన్ ఒక పోస్టు పెట్టాడు. దీనిలో గార్ఫీల్డ్తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
'గొప్ప వ్యక్తి సర్ గ్యారీ సోబర్స్ను కలిశా. కరీబియన్ దీవుల్లో ఉన్న స్టేడియాలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. 1990లు, 2000 సంవత్సరాల్లో భారత్ ఇక్కడ ఆడుతుంటే టీవీలో చూసిన రోజులు గుర్తొస్తున్నాయి. చివరిసారి ఇక్కడకు వచ్చినప్పుడు ఆంటిగ్వాలో సర్ వివ్ రిచర్డ్స్ను కలిశా. ఇప్పుడు సర్ గ్యారీని కలిసే గౌరవం దక్కింది. నిజంగా చాలా అదృష్టవంతుడిని' అంటూ అశ్విన్ పోస్టు పెట్టాడు.