డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఓడిపోయింది. దీంతో ఐసీసీ ట్రోఫీ కోసం భారత అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అందరి చూపూ వన్డే వరల్డ్ కప్ మీదనే ఉంది. స్వదేశంలో జరగనున్న ఈ టోర్నమెంటులో అయినా భారత జట్టు సత్తా చాటాలని, కప్పు కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ అది జరగాలంటే టీమిండియా కొందరు కొత్త కుర్రాళ్లను విండీస్ టూర్లో పరీక్షిస్తే బెటర్..
రుతురాజ్ గైక్వాడ్:ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించాడీ పూణే కుర్రాడు. మొత్తం 16 మ్యాచులు ఆడిన అతను 42.14 సగటు, 147.50 స్ట్రైక్ రేటుతో 590 పరుగులు చేశాడు. అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీలో కూడా గైక్వాడ్ చెలరేగాడు. ఈ టోర్నీలో అతను ఆడిన చివరి పది మ్యాచుల్లో ఏకంగా ఎనిమిది సెంచరీలతో చెలరేగాడు. క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీ బాదిన అతను.. ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. నిలకడగా ఆడే గైక్వాడ్ వంటి వాళ్లు టీమిండియాకు చాలా అవసరం.

నారాయణ్ జగదీశన్:ఈ తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. మొత్తం 8 మ్యాచులు ఆడిన అతను 830 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున సత్తా చాటకపోవడంతో జగదీశన్ మీద ఎవరూ ఆశలు పెట్టుకోవడం లేదు. కానీ రిషభ్ పంత్ లేకపోవడం, రాహుల్ ఫిట్నెస్ సమస్యలతో ఉన్న నేపథ్యంలో విండీస్ టూర్లో అయినా అతన్ని ఆడిస్తే బెటరని నిపుణుల సలహా.
యశస్వి జైస్వాల్:ఐపీఎల్ 2023లో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ సంచలనం యశస్వి జైస్వాల్. రాజస్థాన్ రాయల్స్కు అద్భుతమైన ఆరంభాలు అందించిన అతను 14 మ్యాచుల్లో 625 పరుగులతో రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆరు మ్యాచులు ఆడిన అతను 79.20 సగటుతో 396 పరుగులు చేశాడు. ధవన్, పంత్ లేకపోవడంతో టీమిండియాలో ఎడం చేతి వాటం బ్యాటర్లు కరువయ్యారు. కేవలం జడేజా ఒక్కడే మిగిలాడు. ఇలాంటి సమయంలో జైస్వాల్ చేరితో భారత జట్టు బలం కూడా పెరిగే అవకాశం ఉంది.