వెస్టిండీస్తో రెండో టెస్టుకు టీమిండియా రెడీ అవుతోంది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీని కోసం రెడీ అవుతున్న టీమిండియా ఆటగాళ్లు విండీస్ దిగ్గజం బ్రయాన్ లారాను కలిశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులతో లారా సంతోషంగా మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.
ఈ వీడియోలో ప్రాక్టీస్ తర్వాత కోహ్లీ తిరిగి వెళ్తుండగా.. అక్కడే ఫోన్ మాట్లాడుతున్న లారా కనిపించాడు. అతన్ని చూసిన కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. లారా ఫోన్ మాట్లాడటం చటుక్కున ఆపేసి కోహ్లీకి హ్యాండ్ షేక్ ఇచ్చాడు. ఆ తర్వాత అతన్ని కౌగిలించుకున్నాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత థంబ్స్ అప్ ఇచ్చి, అక్కడి నుంచి కోహ్లీ వెళ్లిపోయాడు. కోహ్లీ కోసం లారా ఇలా చేయడం చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, రోహిత్ శర్మ ఇలా ఒకరి తర్వాత ఒకరుగా వెళ్లి లారాను కలిశారు. అందరితో లారా నవ్వుతూ మాట్లాడాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. లారా ప్రత్యర్థిగా ఎన్నో మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం కూడా ఈ వీడియోలో కనిపించింది.
ఇలాగే తొలి టెస్టు ముందు కూడా విండీస్ గ్రేట్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ను టీమిండియా ప్లేయర్లు కలిశారు. ఆయన్ను కలిసినందుకు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెగ సంతోషించాడు. గార్ఫీల్డ్ సోబర్స్ను కలవగానే తను చిన్నతనంలో టీవీలో చూసిన మ్యాచులన్నీ గుర్తొచ్చాయని చెప్పాడు. ఆ తర్వాత తొలి టెస్టులో అశ్విన్ బంతితో చెలరేగిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ తొలి మ్యాచ్లోనే 171 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనితోపాటు రోహిత్ శర్మ 103 పరుగులు, విరాట్ కోహ్లీ 76 పరుగులతో రాణించారు. దీంతో ఈ మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక రెండో టెస్టులో కూడా విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది.