భారత్తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. వాళ్ల బౌలింగ్ తట్టుకోవడంలో భారత కుర్రాళ్లు పూర్తిగా విఫలమయ్యారు.
ఓపెనర్ ఇషాన్ కిషన్ (55) ఒక్కడే రాణించాడు. అతనితోపాటు శుభ్మన్ గిల్ (34), సూర్యకుమార్ యాదవ్ (24) మాత్రమే ఫర్వాలేదనిపించారు. దీంతో భారత జట్టు 40 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు ఏమాత్రం తడబడలేదు.

ఓపెనర్ బ్రాండన్ కింగ్ (15), అలిక్ అథనాజే (6), షిమ్రాన్ హెట్మెయర్ (9) పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే కెప్టెన్ షాయి హోప్ (63 నాటౌట్) అద్భుతంగా పోరాడాడు. అతనితోపాటు చివర్లో కీసీ కార్టీ (48 నాటౌట్) కూడా రాణించాడు. దీంతో విండీస్ నిలకడగా టార్గెట్ వైపు సాగింది.
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మినహా మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఠాకూర్ ఒక్కడే మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇక తొలి వన్డేలో చెలరేగిన కుల్దీప్ యాదవ్ ఒ్క వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. భారత జట్టు మరీ ఇంత చెత్తగా బౌలింగ్ చేయడంతో విండీస్ ఎక్కడా ఆగేలా కనిపించలేదు.
చక్కని పోరాటంతో ఆ జట్టును చివరి వరకు మోసుకొచ్చిన కెప్టెన్ హోప్, కార్టీ లాంఛనం పూర్తి చేసి ఆ జట్టుకు విజయాన్ని అందించారు. విండీస్ కేవలం 36.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హార్దిక్ పాండ్యా వేసిన 37వ ఓవర్లో కార్టీ వరుసగా రెండు బౌండరీలు బాది మ్యాచ్ ముగించాడు.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడని సంగతి తెలిసిందే. వీళ్ల స్థానాలలో వచ్చిన అక్షర్ పటేల్, సంజూ శాంసన్ ఇద్దరూ కూడా ఏమాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఈ ఓటమితో సీనియర్లు లేకపోతే తాము గెలవలేమని భారత జట్టుకు తెలిసొచ్చింది.