చివరిదైన ఐదో టీ20లో భారత్ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్.. ఐదు మ్యాచుల సిరీసును 3-2 తేడాతో తమ ఖాతాలో వేసుకుంది. లాడర్హిల్ వేదికగా జరిగిన ఐదో మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయమే టీమిండియాను దెబ్బతీసింది. పిచ్ నుంచి బౌలర్లకు కొంత సహకారం అందింది.
దీంతో భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్ (9), యశస్వి జైస్వాల్ (5) విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (61), తిలక్ వర్మ (27) కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. సంజూ శాంసన్ (13) మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 14) కూడా జిడ్డు బ్యాటింగ్ ఆడాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్తో బరిలో దిగిన వెస్టిండీస్కు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (85 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (10) విఫలమయ్యాడు.
అయితే మూడో స్థానంలో వచ్చిన నికోలస్ పూరన్ (47) మరోసారి బ్యాటుతో ఆకట్టుకున్నాడు. చివర్లో షాయి హోప్ (13 బంతుల్లో 22 నాటౌట్) లాంఛనం పూర్తిచేశాడు. దీంతో వెస్టిండీస్ కేవలం 18 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో టీ20 సిరీసు వెస్టిండీస్ వశమైంది.
సిరీస్ ఆసాంతం బ్యాటుతో రాణించిన నికోలస్ పూరన్కు 'ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్' అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచులో 4 వికెట్లతో చెలరేగిన విండీస్ యువ బౌలర్ రొమేరియో షెఫర్డ్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.