వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుంగా రాణించాడు. కేవలం 44 బంతుల్లోన 83 పరుగులతో ఆకట్టుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సూర్య.. వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు.
తన కెరీర్లో 51 టీ20లు ఆడిన సూర్య 45.64 సగటు, 174.33 స్ట్రైక్ రేటుతో 1780 పరుగులు చేశాడు. అదే వన్డేల్లో చూసుకుంటే.. 26 మ్యాచులు ఆడిన అతను 24.33 సగటుతో 511 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై తాజాగా మాట్లాడిన సూర్య తన వన్డే గణాంకాలు చాలా చెత్తగా ఉన్నాయని అంగీకరించాడు.

మూడో టీ20 తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న సూర్య.. ఈ రెండు ఫార్మాట్లలో తన గణాంకాల మధ్య ఉన్న తేడాను అంగీకరించాడు. 'నిజాయితీగా చెప్పుకుంటే నా వన్డే గణాంకాలు చాలా చెత్తగా ఉన్నాయి. దాన్ని ఒప్పుకోవడంలో ఎలాంటి సిగ్గు పడటం లేదు. అందరికీ ఈ విషయం తెలుసు' అని చెప్పాడు.
అయితే వన్డేల్లో కూడా జట్టు కోసం ఆడేందుకు ప్రయత్నించాలని టీం మేనేజ్మెంట్ తనను కోరిందని చెప్పాడు. ఈ బాధ్యతను అవకాశంగా మార్చుకోవడం తన చేతుల్లో ఉందని అభిప్రాయపడ్డాడు. 'అందరూ కూడా నిజాయితీ గురించి మాట్లాడతారు. నిజమే. కానీ మనం మెరుగవడం కూడా ముఖ్యమే' అన్నాడు.
'రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ సర్ ఇద్దరూ కూడా నేను వన్డే ఫార్మాట్ ఎక్కువ ఆడలేదని, కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించాలని, ఎక్కువ ఆడాలని నాకు చెప్పారు. చివరి 10-15 ఓవర్లలో ఆడుతుంటే జట్టు కోసం ఏం చేేయగలవో ఆలోచించు. 15-18 ఓవర్లలో ఆడుతుంటే.. నువ్వు కనీసం 45-50 బంతులు ఆడాలని మాత్రమే మేం ఆశిస్తున్నాం. నీ ఆట నువ్వు ఆడు అంతే అన్నారు' అని సూర్య వెల్లడించాడు.
ఇలా టీం మేనేజ్మెంట్ తనకు అప్పగించిన బాధ్యతను ఒక అవాకశంగా మార్చుకోవడం తన చేతుల్లో ఉన్న పని అని సూర్య అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో ఆట తనకు బాగా తెలుసునని, కానీ వన్డేలు ఆడటం చాలా కష్టమని చెప్పాడు. తన వరకు వ్యక్తిగతంగా వన్డేల్లో ఆట చాలా భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.